ఆంధ్రప్రదేశ్లోని ఉపాధ్యాయ ఉద్యోగాల నియామక నోటిఫికేషన్ కోసం ఎన్నాళ్లుగా ఎదురుచూస్తోన్న నిరుద్యోగులకు వైఎస్ఆర్సీపీ సర్కారు శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండగ తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం వెల్లడించారు. సంక్రాంతి కానుకగా డీఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందని చెప్పారు. డీఎస్సీ గురించి ఇప్పటికే సీఎం జగన్తో చర్చించామని, పోస్టుల సంఖ్య ఎంత అనేది త్వరలోనే తెలియజేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీపై విధి విధానాలను త్వరలోనే తెలియజేస్తామని మంత్రి బొత్స చెప్పారు.
ఎప్పుడు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అవుతుందా అని ఉద్యోగార్థులు గత నాలుగేళ్ల నుంచి ఎదురుచూపులు చూస్తున్నారు. వాస్తవానికి గత ఏప్రిల్ నుంచి డీఎస్సీ ఊరిస్తోంది. ఇదిగో అదిగో అంటూ ఉపాధ్యాయ అభ్యర్థులను ప్రభుత్వం ఊరిస్తోంది. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని, ఆగస్టులో ప్రకటన వెలువడే అవకాశముందని మంత్రి బొత్స గత జులైలో ప్రకటన చేశారు.. ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి కసరత్తు జరుగుతోందని మంత్రి బొత్స తెలిపారు. పాఠశాలల రేషనలైజేషన్తో ఏపీలో స్కూల్స్ సంఖ్య తగ్గి ఉపాధ్యాయుల సగటు సంఖ్య పెరిగింది. ఏకోపాధ్యాయ పాఠశాలలు కూడా సమీపంలోని పెద్ద స్కూల్స్లో విలీనమయ్యాయి. భవిష్యత్తులో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అవకాశం లేకుండా ఈ పని చేశారంటూ విమర్శలు వినిపించాయి. ఈ దశలో అసలు ఖాళీలెన్ని..? వాటిలో తప్పనిసరిగా భర్తీ చేయాల్సినవి ఎన్ని..? అనేది తేలాల్సి ఉంది. ఇందులో ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు, వ్యాయమ ఉపాధ్యాయ ఖాళీలు ఎన్ని అనేది రెండు మూడు రోజుల్లో స్పష్టత వచ్చే సూచనలు ఉన్నాయి. కాగా, శనివారం వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల 4వ జాబితా విడుదల ఉంటుందనే ప్రచారాలను మంత్రి బొత్స సత్యనారాయణ తోసిపుచ్చారు. ఇప్పుడు ఎలాంటి ప్రకటన లేదని.. ఏదైనా ఉంటే చెబుతామని ఆయన స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa