ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘నేను పొలిటీషిన్‌ను కాను’.. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకున్న వివేక్ రామస్వామి

international |  Suryaa Desk  | Published : Tue, Jan 16, 2024, 10:36 PM

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి తప్పుకున్నారు. రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేయాలని భావించిన రామస్వామి అందుకోసం ప్రచారం సైతం మొదలుపెట్టారు. కానీ ఆశించిన స్థాయిలో మద్దతు రాకపోవడంతో వెనక్కి తగ్గారు. డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వానికి తాను మద్దతు పలుకుతున్నట్లు ఆయన ప్రకటించారు.


‘నేను వ్యాపారవేత్తను, రాజకీయ నాయకుడిని కాదు. నా తల్లిదండ్రులు డబ్బులు లేకుండా 40 ఏళ్ల క్రితం ఈ దేశానికి వచ్చారు. నేను బిలియన్ డాలర్ల విలువైన కంపెనీలను ఏర్పాటు చేశాను. అదే సమయంలో అపూర్వను పెళ్లి చేసుకుని మా ఇద్దరు కొడుకులకు తండ్రినయ్యాను. అది అమెరికన్ డ్రీమ్. కన్జర్వేటివ్స్ అయిన మేం చాలా కాలంగా దేని వైపు నుంచో పరిగెడుతున్నాం. ఇప్పుడు దేని కోసమే పరిగెత్తాల్సిన సమయం వచ్చింది’ అని రామస్వామి ట్వీట్ చేశారు.


దక్షిణ భారతదేశం నుంచి వలస వచ్చిన తల్లిదండ్రులకు ఓహియోలో రామస్వామి జన్మించారు. 38 ఏళ్ల ఈ మల్టీ మిలియనీర్.. 2024 రిపబ్లికన్ అభ్యర్థి రేసులోకి దూసుకొచ్చారు. యువకుడైన ఆయన తనదగ్గరున్న అపార ఆర్థిక నిధులతోపాటు ధైర్యంగా మాట్లాడుతూ.. దూకుడుగా ప్రచారం నిర్వహించారు. కానీ ఐఓవా కాకస్ ఎన్నికల్లో వివేక్ రామస్వామికి 7.7 శాతం ఓట్లతో నాలుగో స్థానానికి పరిమితం కాగా.. 51 శాతం ఓట్లతో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. దీంతో అధ్యక్ష పదవి రేసులో ట్రంప్‌కు ఆయన మద్దతు పలకాల్సి వచ్చింది. ఐఓవా కాకస్ ఎన్నికల ప్రచారం సందర్భంగా రామస్వామి ఫ్రాడ్ అని ట్రంప్ ప్రచారం చేశారు. ఆయనకు ఓటేస్తే ప్రత్యర్థి పార్టీకి మేలు చేసినట్లు అవుతుందని అమెరికా మాజీ అధ్యక్షుడు హెచ్చరించారు.


హార్వర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అయిన రామస్వామి.. "Woke, Inc." పేరిట రాసిన పుస్తకం రాశారు. ఈ బుక్ 2021లో బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. దీంతో ఆయన ప్రముఖ వ్యక్తిగా ఎదిగారు. ఆ పుస్తకంలో కార్పొరేట్ వ్యూహాలను ఆయన విమర్శించారు. డిబేట్లలో దూకుడుగా వ్యవహరిస్తూ మీడియా దృష్టిని ఆకర్షించారు. సోషల్ మీడియాలో ఆయన వీడియోలు వైరల్ అయ్యాయి. టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ సైతం రామస్వామి ఫండ్ రైజర్ కార్యక్రమంల పాల్గొన్నారు. తొలి నాళ్లలో వివేక్ పట్ల జనం ఆసక్తి చూపినప్పటికీ.. క్రమంగా ఆయన వెనుకబడిపోయారు. 2023 చివరి నాటికి రిపబ్లికన్ ప్రైమరీ ఓటర్లు వివేక్ రామస్వామిని సింగిల్ డిజిట్‌కే పరిమితం చేశారు.


తాను అమెరికా అధ్యక్షుడినైతే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) సహా ఐదు ప్రభుత్వ సంస్థలను మూసేస్తానని వివేక్ రామస్వామి గతంలో ప్రకటించారు. ఎఫ్‌బీఐలో అత్యవసరం కాని ఉద్యోగాల్లో ఉన్న 20 వేల మందిని తొలగించి.. వారిలో 15 వేల మందికి వేరే విభాగాల్లో ఉద్యోగాలిస్తానని ఆయన చెప్పారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ ఎడ్యుకేషన్‌, న్యూక్లియర్ రెగ్యులేటరీ కమిషన్, బ్యూరో ఆఫ్ ఆల్కహాల్ అండ్ టొబాకో, ఫైర్ ఆర్మ్స్ అండ్ ఎక్స్‌ప్లోజివ్స్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ డిపార్ట్‌మెంట్‌‌లను మూసేస్తామని ఆయన తెలిపారు. సుమారు 10 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తానన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa