ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ పాఠశాలకు విరాళంగా రూ.7 కోట్ల భూమి ఇచ్చిన మహిళ

national |  Suryaa Desk  | Published : Tue, Jan 16, 2024, 10:38 PM

ప్రభుత్వ పాఠశాల కోసం విలువైన తన భూమని ఉచితంగా ఇచ్చింది ఒక మహిళ. రూ.7 కోట్ల విలువైన ఎకరం భూమిని ప్రభుత్వానికి రాసి ఇచ్చేసింది. తమిళనాడులోని మధురైకి చెందిన ఓ మహిళ తాను చేసిన దాతృత్వంతో వార్తల్లో నిలిచారు. మహిళా ప్రభుత్వ పాఠశాలను విస్తరించేందుకు భూమి కావాల్సి ఉండగా.. తన భూమిని ఇచ్చేసింది ఆయిపురాణం అమ్మాళ్ అనే మహిళ. ఆయిపురాణం అమ్మాళ్ చేసిన దాతృత్వానికి ప్రభుత్వం స్పందించింది. ఆమెను జనవరి 26 వ తేదీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సత్కరించనున్నట్లు స్వయంగా సీఎం ఎంకే స్టాలిన్ తెలిపారు. మధురైలోని కోడిక్కుళానికి చెందిన ఆయిపురాణం అమ్మాళ్.. ఓ బ్యాంకులో క్లర్క్‌గా పని చేస్తోంది. కోడిక్కుళంలోని ఒట్టకడై సమీపంలో ఆమెకు ఒక ఎకరం భూమి ఉంది. దాని విలువ రూ.7 కోట్లు. అయితే అక్కడే ఉన్న ఓ ప్రభుత్వ మహిళ పాఠశాల విస్తరణ కోసం భూమి కావాల్సి వచ్చింది. దీంతో తన పేరు మీద ఉన్న రూ. 7 కోట్ల విలువైన ఎకరం భూమిని విరాళంగా ఇచ్చేసింది.


రిజస్ట్రార్ వద్దకు వెళ్లి తన భూమిని ప్రభుత్వం పేరు మీద రిజిస్ట్రేషన్ చేసింది. అనంతరం ఆ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన పత్రాలను తమిళనాడు విద్యాశాఖ అధికారులకు అప్పగించింది. ఈ విషయం తెలుసుకున్న మధురై ఎంపీ ఎస్ వెంకటేశన్.. జనవరి 11 వ తేదీన స్వయంగా కోడిక్కుళం వెళ్లి ఆయిపురాణం అమ్మాళ్‌ను కలిశారు. తీసుకోవాలి అని అనుకునే వారు చాలా మంది ఉంటారు.. కానీ ఇలా ఇవ్వాలి అని అనుకునే వారు మాత్రం కొంతమందే ఉంటారని ఎంపీ ఎస్ వెంకటేశన్.. ఆయిపురాణం అమ్మాళ్‌పై ప్రశంసలు కురిపించారు.


అయితే ప్రభుత్వ పాఠశాల కోసం కోట్ల విలువైన భూమిని ఇచ్చేసిన ఆయిపురాణం అమ్మాళ్‌ పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె చేసిన పనిని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రశంసించారు. ఆయిపురాణం అమ్మాళ్‌ చేసిన దాతృత్వానికి గానూ ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం ఈ నెల 26 వ తేదీన ఆమెకు అవార్డు ఇవ్వనున్నట్లు సీఎం స్టాలిన్ స్వయంగా ఆదివారం ట్విటర్ వేదికగా తెలిపారు. విద్య అనేది అక్షర సంపద అని పేర్కొన్న సీఎం స్టాలిన్.. ఆయి పురాణం అమ్మాళ్ చేసిన విరాళం వేలాది మంది విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరమని పేర్కొన్నారు. ఆమె తమిళ సమాజానికి చిహ్నంగా ఉన్నారని.. విద్యా బోధన అత్యున్నత ధర్మమని.. గణతంత్ర దినోత్సం రోజున ప్రభుత్వం తరపున ప్రత్యేక అవార్డుతో సత్కరిస్తామని స్టాలిన్ ట్వీట్ చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa