అయోధ్యలో రామమందిరం.. కోట్లాది మంది హిందువులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కల సాకారం కావడానికి మరికొన్ని గంటల సమయమే ఉంది. జనవరి 22న మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట మధ్య అయోధ్యలో ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరుగనుంది. ఈ క్రమంలో అయోధ్య రామమందిరం గురించి ఒక్కో విశేషం వెలుగులోకి వస్తోంది. తాజాగా అయోధ్యలో ప్రతిష్టించబోయే రాముడి విగ్రహం తొలి చిత్రం వెలుగులోకి వచ్చింది. కేంద్ర మంత్రి శోభా కరాండ్లజె సోషల్ మీడియా (X) ద్వారా ఆయోధ్య మందిరంలో ప్రతిష్టించబోయే రాముడి విగ్రహం చిత్రాన్ని షేర్ చేశారు. ‘బాలరాముడి తొలి చిత్రం ఇదే. దశాబ్దాల కల నెరవేరే సమయం ఆసన్నమైంది’ అంటూ ఆమె రాసుకొచ్చారు. కృష్ణ శిలతో రూపొందించిన ఈ విగ్రహం అద్భుతంగా ఉంది.
అయోధ్య రాముడి విగ్రహం విశేషాలు:
★ అయోధ్య రాముడి విగ్రహాన్ని కృష్ణ శిలతో రూపొందించారు.
★ 5 సంవత్సరాల బాలరాముడు పీఠంపై నిల్చున్నట్లుగా విగ్రహం తయారుచేశారు.
★ విగ్రహం ఎత్తు 5 అడుగులు (51 ఇంచులు). బరువు 150 కిలోలు.
★ ఏటా శ్రీరామనవమి రోజున గర్భ గుడిలోని బాలరాముడి విగ్రహంపై సూర్య కిరణాలు నేరుగా ప్రసరిల్లేలా ఆలయాన్ని ప్రత్యేక పద్ధతిలో నిర్మించారు.
★ మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ ఈ విగ్రహాన్ని రూపొందించారు. విగ్రహం పూర్తయ్యే వరకు ఆయన దీక్షలో ఉన్నారు.
★ ముగ్గురు శిల్పులు మూడు వేర్వేరు విగ్రహాలను రూపొందించగా.. అరుణ్ యోగిరాజ్ రూపొందించిన శిల్పాన్ని అయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్టు ఎంపిక చేసింది.
★ జనవరి 22న మధ్యాహ్నం అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట జరుగనుంది.
★ ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో కోసం ప్రధాని మోదీ ప్రత్యేక దీక్షలో ఉన్నారు.
★ బాలరాముడి విగ్రహానికి ఒక్కో రోజు ఒక్కో రంగు వస్త్రాలను ధరింపజేస్తారు.
★ ప్రాణ ప్రతిష్ట తర్వాత 56 రకాలతో బాలరాముడికి నైవేద్యం పెడతారు. లక్నోకు చెందిన భక్తుడు 56 రకాల నైవేద్యాలను సిద్ధం చేశాడు.
★ లడ్డూ, దూద్పేడా స్వీట్లను అయోధ్యలో ప్రసాదంగా పంపిణీ చేయనున్నారు.
★ ప్రాణప్రతిష్ట కార్యక్రమం వేళ ప్రసాదం పంపిణీ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం లక్ష లడ్డూలను తయారు చేయించి పంపించింది.
★ ప్రాణప్రతిష్ట అనంతరం కూడా అయోధ్యలో నిర్మాణ పనులు కొనసాగుతాయి. 2025 వరకు అయోధ్య రామమందిర పనులు పూర్తవుతాయని తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది.
అయోధ్యలో ప్రతిష్టించనున్న రాముడి విగ్రహం ఇదే అంటూ సోషల్ మీడియాలో అనేక ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కళ్లకు గంతలు తీసిఉన్న విగ్రహం ఫోటోలు కూడా షేర్ చేస్తున్నారు. ప్రాణప్రతిష్టకు ముందు విగ్రహం కళ్లకు గంతలు తీసే అవకాశం లేదని భక్తులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఫోటోలు ఒరిజినలా? ఫేకా? అనే విషయంపై అయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు స్పందించాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa