ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అయోధ్యలో ఉగ్ర కలకలం.. రామమందిర ప్రారంభోత్సవం వేళ ముగ్గురు అరెస్ట్‌

national |  Suryaa Desk  | Published : Fri, Jan 19, 2024, 10:47 PM

అయోధ్యలో దివ్య రామ మందిర ప్రారంభోత్సవం జనవరి 22 వ తేదీన అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ప్రాణ ప్రతిష్ఠ జరిగే రోజు అయోధ్యకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా దేశ, విదేశాల నుంచి దాదాపు 11 వేల మంది అతిథులు హాజరు కానున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర, రాష్ట్రాలకు చెందిన భద్రతా బలగాలు అయోధ్యలో ముమ్మరంగా గస్తీ కాస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అయోధ్యలో ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులను యూపీ యాంటీ టెర్రరిజమ్ స్వ్కాడ్ పోలీసులు పట్టుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


అయోధ్య జిల్లాలో ముగ్గురు అనుమానితులను యూపీ యాంటీ టెర్రరిజమ్‌ స్క్వాడ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయోధ్య ప్రారంభోత్సవం సందర్భంగా జిల్లాలో నిర్వహించిన తనిఖీల్లో ముగ్గురు అనుమానితులను ఎస్‌ఏటీ పోలీసులు అరెస్టు చేసినట్లు యూపీ స్పెషల్‌ డీజీపీ ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు. అయితే వారు ఏ ఉగ్రగ్రూప్‌నకు చెందినవారు అనే విషయం తెలియాల్సి ఉందని చెప్పారు. అయితే ఆ ముగ్గురు అనుమానితులను విచారణ చేస్తున్నట్లు వివరించారు.


అయోధ్య ప్రారంభోత్సవం నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. ఇప్పటికే అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు.. నగర వ్యాప్తంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు నిఘాను ఏర్పాటు చేస్తున్నారు. అయోధ్యలో ఇప్పటికే వెయ్యికి పైగా ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. ఏఐ టెక్నాలజీ, హ్యూమన్ ఇంటెలిజెన్స్తో కూడిన 10 వేల సీసీ కెమెరాలను వినియోగిస్తున్నారు. అనుమానాస్పద వస్తువులను గుర్తించేలా 4.5 కిలోమీటర్ల పరిధిలో డోమ్ను ఏర్పాటు చేశారు. డ్రోన్లతో పాటు సుమారు 10 వేల మంది పోలీసు, పారామిలిటరీ బలగాలను మోహరించారు. 100 డీఎస్పీలు, 325 మంది ఇన్స్పెక్టర్లు, 800 మంది ఎస్ఐలు విధులు నిర్వర్తిస్తున్నారు.


మరోవైపు.. రామ మందిర ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే అయోధ్యకు రాముడి విగ్రహం చేరుకోగా.. దాన్ని గర్భగుడిలోకి తరలించారు. ఆ తర్వాత అయోధ్యలో కొలువు దీరనున్న ఆ అయోధ్య రాముడి విగ్రహానికి సంబంధించిన ఫోటో బయటికి రావడంతో అది సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఈ నెల 22 వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాలకు ప్రారంభం కానున్న రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం 84 సెకన్ల పాటు జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనున్న ఈ కార్యక్రమం సమయంలో గర్భగుడిలో మోదీతోపాటు యూపీ గవర్నర్, సీఎం, ఆరెస్సెస్ చీఫ్, రామ మందిర ప్రధాన పూజారి ఉండనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa