ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మొన్న బియ్యం, నేడు గోధుమలు.. దేశంలో ఏడేళ్ల కనిష్ఠానికి గోధుమల నిల్వలు.. కొరత తప్పదా

national |  Suryaa Desk  | Published : Fri, Jan 19, 2024, 10:48 PM

దేశంలో గోధుమల నిల్వలు భారీగా పడిపోయాయి. ఈ నెల 1 వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ గోదాముల్లో గోధుమల స్టాక్ 163.59 లక్షల టన్నులుగా ఉన్నట్లు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, స్టేట్ ఫుడ్ ఏజెన్సీలు తెలిపాయి. ఈ గణాంకాలను పరిశీలిస్తే గోధుమల నిల్వలు భారీగా తగ్గినట్లు తెలుస్తుంది. 2017 తర్వాత ఈ స్థాయిలో గోధుమల నిల్వలు పడిపోవడం ఇదే తొలిసారి కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఏడేళ్ల కనిష్ఠానికి గోధుమల నిల్వలు చేరినట్లు పేర్కొన్నాయి. గోధుమల నిల్వల కనీస బఫర్ స్థాయిని 138 లక్షల టన్నులుగా ఎఫ్‌సీఐ నిర్ణయించింది.


ప్రస్తుతానికి అయితే ఎలాంటి ఇబ్బంది లేదని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. దేశంలో గోధుమల నిల్వలు బఫర్‌ స్థాయి కంటే ఎక్కువగానే ఉన్నాయని పేర్కొంది. కానీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిస్థితులను చూస్తే గోధుమల నిల్వలు మరింత తగ్గిపోయే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఉక్రెయిన్‌- రష్యా, ఇజ్రాయెల్‌-హమాస్‌, ఇరాన్‌- పాకిస్థాన్ దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా పలు దేశాల ఎగుమతులు, దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీంతో పాటు ద్రవ్యోల్బణం పెరిగిపోతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితుల్లో భారత్‌లో గోధుమలకు కొరత ఏర్పడితే.. అది తీవ్ర ఆహార సంక్షోభానికి దారి తీయొచ్చని విశ్లేషకులు హెచ్చరికలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దేశంలో వెంటనే గోధుమల నిల్వలను పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.


ప్రపంచంలోని రెండో అతి పెద్ద గోధుమల ఉత్పత్తిదారుగా ఉన్న భారత్.. గోధుమల ఎగుమతిని నిలిపివేసింది. ధాన్యం ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి చేపట్టిన అనేక చర్యల్లో గోధుమల ఎగుమతిపై నిషేధం విధించడం కూడా ఒకటి. గోధుమలు, బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధించడంతోపాటు టోకు వ్యాపారులు, రిటైలర్లు వెయ్యి టన్నుల కంటే ఎక్కువ గోధుమల నిల్వలను కలిగి ఉండకూడదని నిషేధం విధించింది. అయితే గత 7 సంవత్సరాల్లో అత్యధిక నిల్వలు 2021లో నమోదయ్యాయి. మొత్తం గోధుమ నిల్వలు 342.90 లక్షల టన్నులుగా ఉండగా.. అది 2022లో 330.12 లక్షల టన్నులకు.. 2023లో 171.70 లక్షల టన్నులకు తగ్గిపోయింది. ప్రస్తుత నిల్వల ప్రకారం స్టాక్ 163.59 లక్షల టన్నులుగా ఉంది.. వెంటనే ధాన్యం సేకరణ చేస్తామని ఎఫ్‌సీఐ ప్రకటించింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa