ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అయోధ్యలో సీతారాములను ఎందుకు ప్రతిష్ఠించలేదు? చాగంటి వివరణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 24, 2024, 06:59 PM

అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఘనంగా జరిగింది. 500 ఏళ్ల తర్వాత రాముడు అయోధ్యకు తిరిగొచ్చాడంటూ దేశ ప్రజలంతా సంబరాలు చేసుకున్నారు. రామ మందిర ప్రారంభోత్సవం రోజున దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం కనిపించింది. తొలి రోజు వీఐపీలు బాలక్ రామ్‌ను సందర్శించుకోగా.. ప్రాణ ప్రతిష్ఠ జరిగిన మరుసటి రోజు ఏకంగా 5 లక్షల మంది భక్తులు అయోధ్య రాముణ్ని దర్శించుకున్నారు. ఇంకా వేలాది మంది భక్తులు క్యూ లైన్లలో నిలబడి ఉన్నారు. భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తడంతో.. వారిని నియంత్రించడం భద్రతా సిబ్బందికి కష్టంగా మారింది.


అయోధ్యలో బాల రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన సంగతి తెలిసిందే. మన దగ్గర భద్రాచలం, ఒంటిమిట్టలో ఉన్నట్టుగా సీతా, లక్ష్మణ సమేత రాముడి విగ్రహం కాకుండా.. బాల రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ఏంటనే ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది. ఈ రామ్ లల్లా విగ్రహాన్ని కర్ణాటకకు చెందిన అరుణ్ యోగి రాజ్ అనే శిల్పి చెక్కిన సంగతి తెలిసిందే. సీతా రామ లక్ష్మణ హనుమంతుడి విగ్రహాలతో ఉన్న అరుణ్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఇదే విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారని చాలా మంది భావించారు. కానీ బాల రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.


అయోధ్యలో బాల రాముడి విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేశారనే విషయమై ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర రావు పేరిట ఏర్పాటు చేసిన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టు కనిపించింది. ‘అయోధ్యలో బాల రాముల వారిని ఎందుకు ప్రాణ ప్రతిష్ఠ చేశారు, సీత రాముల వారిని ఎందుకు చేయలేదని చాలా మంది అడుగుతున్నారు. దీనికి జవాబు ఏంటంటే.. సముద్రగుప్తుడు, విక్రమాదిత్య కాలం 1076 – 1126 CE కు ముందు నుంచే అయోధ్యలో రామాలయం ఉంది, అప్పుడే రామ్ లాల్ల అని 5-6 అంగుళాల బాల రాముడి మూర్తి ఉండేది. కాల క్రమేణా గుడి ఆక్రమణలు జరిగినా, తరువాత కాలంలో అక్కడే అయోధ్యలో తవ్వకాలు జరిపితే అదే బాల రాముడి మూర్తి బయటపడింది. అంటే దాని అర్దం, ఇది మన చరిత్ర కదా..! మనం మళ్ళీ అదే స్థలంలో రాముల వారి కోసం ఆలయం పునః నిర్మిస్తున్నాం కదా.. అప్పుడు ఎవరికి ప్రాణ ప్రతిష్ఠ చేయాలి, మన చరిత్రను పరిగణనలోకి తీసుకొని అదే బాల రాముల వారికి కదా చేయాలి. అందుకే బాల రాముల వారి వయసు 5-8 సంవత్సరాలు ఉండే మూర్తిని చెక్కారు’ అంటూ వివరణ ఇచ్చారు.


‘‘అయోధ్యలో రామాలయం మొదటి అంతస్తులో గర్భ గుడిలో బాల రాములవారు ఉన్నారు. ఇంకా 2 అంతస్తులు ఉన్నాయి కదా.. గుడి పూర్తిగా నిర్మాణం అయ్యాక సీత రామ లక్ష్మణ హనుమ స్వామితో సహా విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. అలాగే మాత కౌసల్య దేవికి కూడా ఆలయంలో పూజలు చేస్తారు’’ అని చాగంటి కోటేశ్వర రావు వివరణ ఇచ్చారు. 1949లో అయోధ్యలోని బాబ్రీ మసీదు లోపల రాముడి విగ్రహం కనిపించింది. దీంతో ఉద్రిక్తతలు తలెత్తాయి. అయోధ్య స్థలం మసీదుకు చెందుతుందా..? రామ మందిరానిదా? అనే విషయమై దశాబ్దాల తరబడి న్యాయపోరాటం జరిగింది. మసీదులో కనిపించిన ఆ రాముడి విగ్రహాన్ని ఇంత కాలం పాటు ఓ టెంటులో ఉంచి పూజలు చేస్తూ వచ్చారు. త్వరలోనే ఈ విగ్రహాన్ని సైతం మందిరం లోపల బాలక్ రాముడికి ఎదురుగా ఉంచనున్నారు. ఇందుకోసం పూజా క్రతువులు నిర్వహిస్తారు.


అంతే కాదు అయోధ్యలో రామ్ లల్లా విగ్రహం ఏర్పాటు కోసం ముగ్గురు శిల్పులు విగ్రహాలను చెక్కారు. ఈ మూడింటి మధ్య ఓటింగ్ నిర్వహించిన రామ్ జన్మభూమి ట్రస్ట్.. చివరకు కర్ణాటకలోని మైసూర్‌కు చెందిన శిల్పి అరుణ్ యోగి రాజ్ చెక్కిన 51 అంగుళాల విగ్రహాన్ని ఎంపిక చేసింది. ఈ విగహాన్ని 250 కోట్ల సంవత్సరాల వయసున్న కృష్ణ శిలతో అరుణ్ యోగి రాజ్ చెక్కారు. రాజస్థాన్‌‌కు చెందిన శిల్పి సత్యనారాయణ పాండే చెక్కిన పాలరాతి విగ్రహం కూడా ఆలయ ట్రస్ట్ వద్ద ఉంది. ఈ విగ్రహాన్ని సైతం అయోధ్య రామాలయంలో మరో చోట ఏర్పాటు చేస్తారు. కర్ణాటకు చెందిన గణేశ్ భట్ అనే మరో శిల్పి సైతం బాల రాముడి విగ్రహాన్ని చెక్కారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa