ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అయోధ్య ప్రారంభోత్సవం పూర్తి.. మరో 13 ఆలయాల నిర్మాణానికి భారీ ప్రణాళికలు

national |  Suryaa Desk  | Published : Wed, Jan 24, 2024, 10:26 PM

శతాబ్దాల పోరాటాలు, వివాదాలు, ప్రాణ త్యాగాలు, ఉద్యమాలు, న్యాయపరమైన చిక్కులు అన్నీ దాటి అయోధ్యలో దివ్యమైన రామ మందిర నిర్మాణం శరవేగంగా పూర్తి చేసుకుని.. ప్రారంభోత్సవం జరుపుకుంది. దీంతో కోట్లాది మంది హిందువుల కల సాకారం అయింది. అయితే ప్రస్తుతం అయోధ్యలో బాలక్ రామ్ మందిర్ నిర్మాణం పూర్తి కాలేదు. గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం మాత్రమే జరగ్గా.. ఇంకా పై అంతస్థుల్లో పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అయోధ్యలో ఈ బాలక్ రామ్ మందిర్ మాత్రమే కాకుండా మరో 13 ఆలయాలు నిర్మించనున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తాజాగా వెల్లడించింది. వాటి కోసం భారీ ప్రణాళిక కూడా చేసినట్లు స్పష్టం చేసింది.


అయోధ్య‌లో కేవ‌లం బాల‌క్ రాముడి ఆలయమే కాకుండా మరో 13 ప్ర‌ధాన ఆల‌యాల నిర్మిస్తామని శ్రీరామ‌ జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్ట్ కోశాధికారి స్వామి గురుదేవ్ గిరీజీ తాజాగా మీడియాకు వెల్లడించారు. ఇందు కోసం భారీ ప్ర‌ణాళిక‌లతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఈ 13 ప్ర‌ధాన మందిరాల్లో 6 దేవాల‌యాలను అయోధ్య రామ‌మందిరం లోప‌ల నిర్మించ‌నున్నట్లు చెప్పారు. మిగిలిన 7 దేవాలయాలను అయోధ్య ఆలయ బయట ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఆ 13 ఆల‌యాల‌ నిర్మాణాలకు సంబంధించిన ప‌నులు.. ప్ర‌స్తుతం పురోగ‌తిలో ఉన్న‌ట్టు స్వామి గురుదేవ్ గిరీజీ చెప్పారు.


ప్రస్తుతం రెండో ఫ్లోర్ నిర్మాణ ప‌నులు జరుగుతున్నాయని వెల్లడించారు. ఆ త‌ర్వాత‌ పై క‌ప్పు, శిఖ‌రం త్వ‌ర‌లోనే పూర్తి కానున్నాయని స్వామి గురుదేవ్ గిరీజీ తెలిపారు. అయోధ్య రామాల‌యంలో మ‌రో 5 ప్ర‌ధాన‌ ఆలయాల పనులు జరుగుతున్నాయని చెప్పారు. రాముడిని విష్ణువు అవతారంగా పరిగణిస్తున్నందున.. గణపతి, శివుడు, సూర్యుడు, జగదాంబ దేవతల ఆల‌యాల‌ను నిర్మిస్తున్నామ‌ని స్పష్టం చేశారు. ఇక ప్రధాన ఆలయానికి 4 మూలల్లో ఈ ఆలయాలను నిర్మించనున్నట్లు చెప్పారు.


ఇక‌ శ్రీరాముని ప‌ట్ల భ‌క్తిని చాటిన హనుమంతునికి కూడా ప్ర‌త్యేకంగా ఆల‌యం నిర్మిస్తున్న‌ట్లు గురుదేవ్ వెల్ల‌డించారు. ఈ దేవాలయాల్లో ఇప్పటికే విగ్రహాలు ప్రతిష్ఠించే పనులు జరుగుతున్నట్లు వివరించారు. ప్ర‌స్తుతం ఆయా ఆలయాల్లో పాలిషింగ్, ఫినిషింగ్ టచ్ ప‌నులు మిగిలి ఉన్నాయ‌ని పేర్కొన్నారు. సీతా ర‌సోయి వద్ద సీతా దేవి వంటగదిగా పరిగణించబడే ప్రాంతంలో అన్నపూర్ణ దేవి ఆల‌యాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వీటితోపాటు అయోధ్య రామాల‌యానికి బయట కూడా మ‌రో 7 దేవాలయాలను నిర్మిస్తున్న‌ట్లు స్వామి గురుదేవ్ గిరీజీ పేర్కొన్నారు. వాల్మీకి, వశిష్టుడు, విశ్వామిత్రుడు, శబ‌రి, రాముడి కోసం ప్రాణాలు అర్పించిన పక్షి జటాయువు కోసం ఆ ఆలయాలను నిర్మించనున్నట్లు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa