గత కొద్ది రోజులుగా దేశంలో ఎక్కడ చూసినా అయోధ్య రామ మందిరం గురించే చర్చ జరుగుతోంది. ఈ నెల 22వ తేదీన బాల రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయడం ద్వారా అయోధ్య రామ మందిరాన్ని ప్రారంభించారు. అంగరంగ వైభవంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని కోట్లాది మంది ప్రజలు టీవీలు, ఫోన్ల ద్వారా తిలకించారు. ప్రాణప్రతిష్ఠ అనంతరం బాల రాముణ్ని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతున్నారు. హిందూ ఆచారాల ప్రకారం.. ఆలయాలను కొత్తగా నిర్మించిన సమయంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రాణ ప్రతిష్ఠ అంటే విగ్రహంలోకి ప్రాణ శక్తిని స్థాపించడం. ఆ దైవాన్ని విగ్రహంలోకి ఆవాహన చేయడమే ప్రాణ ప్రతిష్ఠ. ఈ కార్యక్రమం ద్వారా ఆ విగ్రహం పూజకు అర్హమైందిగా మారుతుంది.
పవిత్ర నదీ జలాలతో విగ్రహానికి స్నానమాచరించి.. తర్వాత శుభ్రమైన వస్త్రంతో తుడిచి, సంప్రదాయబద్ధంగా అలంకరణ చేసిన అనంతరం మంత్రోచ్ఛారణతో ప్రాణ ప్రతిష్ఠ జరుపుతారు. అనంతరం హారతి ఇచ్చి ఆ దైవానికి నైవేద్యం సమర్పిస్తారు. అయోధ్య బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ సమయంలోనూ ఇలాగే చేశారు. రాముడు జన్మించిన అభిజిత్ ముహూర్తంలో బాలరాముడికి ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించారు. ప్రాణ ప్రతిష్ఠకు ముందుతో పోలిస్తే.. ప్రాణ ప్రతిష్ఠ తర్వాత అయోధ్య బాలక్ రామ్ విగ్రహంలో జీవ కళ ఉట్టిపడుతుండటాన్ని గమనించొచ్చు. ఈ విషయాన్ని స్వయంగా ఆ విగ్రహ శిల్పి అరుణ్ యోగి రాజ్ చెప్పాడు. నెలల తరబడి తాను చెక్కిన విగ్రహమే అయినా సరే.. ప్రాణప్రతిష్ఠ తర్వాత రాముడు పూర్తిగా మారిపోయాడని ఆయన చెప్పారు. తాను చెక్కినప్పుడు విగ్రహం వేరు.. ప్రాణ ప్రతిష్ఠ తర్వాత విగ్రహం వేరని ఆయన తెలిపరు. అయోధ్య వచ్చి రాముణ్ని దర్శించుకున్న ఆయన.. గర్భాలయంలో ఉన్న విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయారు. బాల రాముడి ముఖంలో చిరునవ్వుతోపాటు.. ముఖంలో హావభావాలు మారిపోయాయని ఆయన చెప్పారు.
అరుణ్ యోగి రాజ్ ఏడు నెలలకుపైగా కుటుంబానికి దూరంగా ఉండి మరీ బాల రాముడి విగ్రహాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో చెక్కారు. ఆ విగ్రహాన్ని ఆయన కంటే దగ్గర, సునిశితంగా మరొకరు గమనించి ఉండరు. అలాంటి వ్యక్తే రాముడు మారిపోయాడని చెబుతుండటం గమనార్హం. ప్రాణ ప్రతిష్ఠ తర్వాత విగ్రహం మరింత కళగా కనిపిస్తోందని భక్తులు కూడా చెబుతున్నారు.
ప్రాణ ప్రతిష్ఠకు ముందు విగ్రహం ఉన్న వాతావరణం వేరు.. ప్రాణ ప్రతిష్ఠ తర్వాత గర్భాలయంలోని వాతావరణం వేరు. దీప కాంతుల నడుమ.. స్వర్ణాభరణాలు, రంగు రంగుల పూల మాలలతో.. ఆ బాలరాముడి అందం అమాంతం పెరిగిపోయింది. అయోధ్యలో కొలువైన రాముణ్ని దర్శించుకున్న అనంతరం తాము అలౌకిక అనుభూతికి లోనయ్యామని భక్తులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa