తూర్పుగోదావరి జిల్లాలో విచిత్రమైన ఘటన జరిగింది. కరెంట్ షాక్తో కాలిపోయిన ఓ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రమాదంలో చనిపోయాడని భావిస్తున్న వ్యక్తి నుంచే వారికి ఫోన్ వచ్చింది. దీంతో బంధువులంతా అవాక్కయ్యారు. చివరకు ఆ మృతదేహం మరొకరిదని.. అదొక హత్య అని తేలింది. సినిమాను మించిన ట్విస్ట్లు తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వీరంపాలెంలో జరిగింది.
ధాన్యం వ్యాపారి కేతమళ్ల పూసయ్యకు చెందిన పొలంలో విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ దగ్గర దాదాపు పూర్తిగా కాలిపోయిన మృతదేహం ఉండడాన్ని సమీప రైతులు గుర్తించారు. అక్కడ ఉన్న చెప్పులను చూసి పూసయ్యగా భావించి బంధువులకు, పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి పంచనామా పూర్తి చేసి పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం చేస్తుండగా.. పూసయ్య నుంచి బంధువులకు ఫోన్ వచ్చింది. తాను మరో ప్రాంతంలో ఉన్నానంటూ చెప్పడంతో అసలేం జరుగుతుందో అర్థంకాక కొద్దిసేపు బంధువులు కన్ఫ్యూజన్లో ఉన్నారు.
ఫోన్లో ఆయన తెలిపిన ప్రాంతానికి హడావిడిగా వెళ్లగా.. అక్కడ గాయపడి ఉన్న పూసయ్యను చూసి ఆశ్చర్యపోయి ఏం జరిగిందని ప్రశ్నించారు. ఆ రోజు తన పొలంలో ముగ్గురు గుర్తుతెలియని యువకులు ఓ మృతదేహానికి పెట్రోలు పోసి నిప్పంటించడాన్ని చూశానన్నారు. అక్కడికి వెళ్లి వారిని నిలదీయడంతో తనపై దాడి చేశారని ఆయన చెప్పుకొచ్చారు. తన చెప్పులను ఆ మృతదేహం దగ్గర పడేసి, తనను ఆటోలో తీసుకువెళ్లారన్నారు. ఆ సమయంలో తాను స్పృహ తప్పానన్నారు.
ఆ తర్వాత కళ్లు తెరచి చూస్తే రాజమహేంద్రవరం రూరల్ మండలం పిడింగొయ్యి వద్ద పొలాల్లో ఉన్నట్లు గమనించానని వివరించారు. సమీపంలోని వ్యక్తికి చెందిన ఫోన్ నుంచి సమాచారం అందించానని పూసయ్య తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రంగంపేట పోలీసులు తెలిపారు. పూసయ్య పొలంలో హత్యకు గురైంది ఎవరు?.. ఆ ముగ్గురు యువకులు ఎవరు? అనేది తేలాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa