తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే వేలాది మంది భక్తులకు టెండర్ల ప్రక్రియను నిలిపివేసి, మిల్లర్ల ద్వారా నాణ్యమైన బియ్యం సేకరించి అన్నప్రసాదాలు అందిస్తున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో అగ్ని ప్రమాదాలు నివారించేందుకు టీటీడీ వంటశాలలు, హోటళ్లు, స్థానికులకు ఎల్.జి పైపులైన్ ద్వారా గ్యాస్ అందించేందుకు బోర్డు సమావేశంలో చర్చించి చర్యలు తీసుకుంటున్నామన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ ఈవో భక్తులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
దర్శన టికెట్ బుక్ చేసుకున్నాము గదులు ఆన్లైన్లో దొరకడం లేదని ఓ భక్తుడు ఈవోకు చెప్పారు. తిరుమలలో 7500 గదులు మాత్రమే ఉన్నాయన్నారు. ఇందులో 50 శాతం గదులు ఆన్లైన్లో అడ్వాన్స్ బుకింగ్ లో కేటాయిస్తున్నామని తెలిపారు. ఆన్లైన్లో గదులు దొరకని భక్తులు తిరుమలలో సిఆర్వోలో నమోదు చేసుకుని గదులు పొందవచ్చు. తిరుపతిలో కూడా గదులు పొందే అవకాశం ఉందన్నారు. బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి పర్వదినాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది కావున ఆ సమయంలో వయోవృద్ధులు, దివ్యాంగులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు. అయినా సరే వారికి బ్రహ్మోత్సవాలు, ఇతర పండుగల సమయంలో దర్శనాల అంశాన్ని పరిశీలిస్తామన్నారు.
భక్తుల కోరిక మేరకు మూడు నెలలు ముందుగా రూ.300 దర్శనం, శ్రీవాణి ట్రస్ట్, ఆర్జిత సేవలు, వసతి విడుదల చేస్తున్నామన్నారు ఈవో. తద్వారా భక్తులు రవాణా, సెలవులు ముందస్తుగా ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. టైమ్స్ స్లాట్ ద్వారా రెండు గంటల్లో దర్శనం అయిపోతుందన్నారు. ఆఫ్ లైన్లో శ్రీవారి సేవ ఇస్తుండడం వల్ల దళారుల బెడద ఎక్కువగా ఉంది. ఈ కారణంగా ఆన్లైన్ లో పూర్తి కోటా కేటాయిస్తున్నామన్నారు. చాలామంది భక్తులు టోకెన్ల కోసమే నడక మార్గాల్లో తిరుమలకు వస్తున్నారని.. ఇటీవల చిరుత దాడి జరిగిన సంఘటనలు తెలిసిందే అన్నారు. అందుకే తిరుపతిలోనే టోకెన్లు జారీ చేస్తున్నామని.. వీటిని పొందిన భక్తులు మొక్కులున్నవారు నడిచి రావచ్చన్నారు. మొక్కులు లేనివారు రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకోవచ్చన్నారు.
అంగప్రదక్షిణ టికెట్లు మూడు నెలల ముందు ఆన్లైన్లో ఇస్తున్నారని.. ఆఫ్ లైన్లో ఇవ్వడం ద్వారా భక్తులు క్యూలో నిలబడి ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎక్కువ మంది భక్తుల కోరిక మేరకే ఆన్లైన్లో ఈ టికెట్లు కేటాయిస్తున్నాం ఈ విధానం చక్కగా ఉందన్నారు. టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా చాలామంది భక్తులకు సమాచారం తెలియజేస్తున్నామన్నారు. ఈ-మెయిల్ ద్వారా కూడా భక్తులు సమాచారం తెలుసుకోవచ్చన్నారు. తిరుమలలో ప్రైవేట్ వాహనాలు అతివేగంగా వెళ్లడం, స్పీడ్ లిమిట్పై విజిలెన్స్, పోలీసు అధికారులు దృష్టికి తీసుకెళ్లి ప్రైవేటు వాహనాల డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇప్పిస్తామన్నారు.
ముస్లిం భక్తులు శ్రీవారి సేవకు రావాలని కోరడం చాలా సంతోషకరమన్నారు ఈవో. ముస్లిం భక్తులు చాలామంది శ్రీవారిని దర్శించుకుంటున్నారని.. పలువురు ముస్లిం భక్తులు స్వామివారిపై అచంచలమైన భక్తి విశ్వాసాలతో అనేక విరాళాలు కూడా సమర్పించారన్నారు. వీటిలో స్వామివారికి స్వర్ణ పుష్పాలు, కాసులమాల వంటివి ఉన్నవన్నారు.. శ్రీవారి సేవలకు రావాలనే విజ్ఞప్తిపై సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామన్నారు. శుక్రవారం అభిషేకం నాడు మేల్ చాట్ వస్త్రం సేవ ఉంటుందన్నారు. అడ్వాన్స్ బుకింగ్ పోను విచక్షణ కోటాలో ఐదు టికెట్లు మాత్రమే ఉంటాయన్నారు. వీటిని ప్రాధాన్యత ప్రకారం కేటాయిస్తామన్నారు. తిరుమలలో ఎలక్ట్రానిక్ డిప్ లో కూడా అభిషేకం టికెట్లు పొందే అవకాశం ఉందన్నారు. భక్తులకు త్వరగా లడ్డూ ప్రసాదం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa