ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కృష్ణుడు మొండివాడు.. మథుర శ్రీకృష్ణ జన్మభూమి వివాదంలో యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్య

national |  Suryaa Desk  | Published : Wed, Feb 07, 2024, 08:09 PM

మన దేశంలోని పురాతన కాలంలో వేల ఏళ్ల క్రితం నిర్మించిన భారీ హిందూ దేవాలయాలను.. ఆ తర్వాత పాలించిన ముస్లిం పాలకులు ధ్వంసం చేశారు. దేశంలోని ఎన్నో వాస్తు, శిల్ప కళలతో కూడిన ఆలయాలు నామరూపాలు లేకుండా పోయాయి. ఈ క్రమంలోనే రాముడి జన్మస్థలంగా భావించే అయోధ్యలో ఆలయాన్ని కూల్చేసి.. బాబ్రీ మసీదును నిర్మించారు. అటు.. వారణాసిలో కాశీ విశ్వనాథ స్వామి ఆలయాన్ని పడగొట్టి జ్ఞానవాపి మసీదును కట్టారని హిందూ సంఘాలు ఏళ్లుగా వాదిస్తున్నాయి. వీటితోపాటు మథురలో శ్రీ కృష్ణుడి జన్మ స్థలంగా భావించే ప్రాంతంలో షాహీ ఈద్గా మసీదును నిర్మించారు. వందల ఏళ్ల నాటి అయోధ్య సమస్య సుప్రీం కోర్టు తీర్పుతో సమసిపోవడంతో.. ఆ తర్వాత వారణాసి జ్ఞానవాపి మసీదు, మథుర షాహీ ఈద్గా మసీదుల వైపు దేశంలోని హిందువుల దృష్టి పడింది. ఈ రెండు వివాదాలను కూడా త్వరలోనే పరిష్కరించి అక్కడ హిందూ ఆలయాలు కట్టాలనే వాదనలు వినిపిస్తున్నాయి.


ఈ క్రమంలోనే ఉత్తర్‌ప్రదేశ్‌లో బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవాన్ని స్వాగతించిన ఆయన.. ఇక గుజరాత్‌లోని మథురలో వివాదంలో ఉన్న శ్రీ కృష్ణ జన్మభూమి అంశం బీజేపీ ప్రాధాన్యత జాబితాలో తర్వాతి స్థానంలో ఉందని స్పష్టం చేశారు. అయోధ్యలో వేడుకలను చూసిన నంది బాబా.. మొండిగా రాత్రికి రాత్రే బారికేడ్లను తెరిచాడని.. ఇటీవల జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలోని నేలమాళిగలో హిందూ దేవతలకు పూజలు ప్రారంభించడాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నంది శివుడి వాహనం కాగా.. జ్ఞానవాపిలో శివలింగానికి పూజలు జరుగుతున్నాయని యోగి తెలిపారు. ఇక ఇప్పుడు మన కృష్ణుడు మొండిగా ఉన్నాడని శ్రీకృష్ణ జన్మభూమి- షాహీ ఈద్గా మసీదు వివాదం గురించి యూపీ అసెంబ్లీలో ఆదిత్యనాథ్ ప్రస్తావించారు.


అయితే కృష్ణుడి గురించి ఆదిత్యనాథ్ స్పందించడం.. శ్రీకృష్ణ జన్మభూమి వివాదానికి సంబంధించిన కేసుకు స్పష్టమైన సూచనగా అర్థం అవుతోంది. గుజరాత్‌లోని మథురలో 17 వ శతాబ్దంలో నిర్మించిన షాహీ ఈద్గా అనే మసీదును గతంలో శ్రీకృష్ణుడి జన్మ స్థలంలో ఉందని హిందూ పిటిషనర్లు పేర్కొనగా.. ఆ ప్రాంతంలో సర్వే చేయాలని అలహాబాద్ హైకోర్టు ఇటీవలె ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు అనుమతులు ఇచ్చింది. అయితే అయోధ్య తర్వాత వారణాసి, మథుర అంశాలు బీజేపీ ఎజెండాలో తదుపరి స్థానాల్లో ఉన్నాయని తాజాగా యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యల ద్వారా అర్థం అవుతోంది. ఇక వారణాసి, మథురలను హిందువులకు అప్పగిస్తే.. మసీదు-మందిరం వివాదాలకు ముగింపు అవుతుందని.. అయోధ్య ఆలయ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి మహారాజ్ చెప్పిన కొన్నిరోజులకే యోగి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.


ఈ సందర్భంగా మహాభారతంలోని ఓ భాగాన్ని యోగి ఆదిత్యనాథ్ ప్రస్తావించారు. కౌరవులు, పాండవుల మధ్య యుద్ధాన్ని ఆపేందుకు శ్రీ కృష్ణుడు చేసిన చివరి ప్రయత్నాన్ని యోగి గుర్తు చేశారు. కృష్ణుడు కౌరవుల వద్దకు వెళ్లి యుద్ధాన్ని విరమించేందుకు చర్చల ఒప్పందం కుదుర్చుకోగా.. దానికి దుర్యోధనుడు నిరాకరించాడని తెలిపారు. అయితే అయోధ్య, కాశీ, మథుర విషయాల్లోనూ ఇదే జరిగిందని పేర్కొన్నారు. కృష్ణుడు ఐదు గ్రామాలను అడిగాడని కానీ హిందువులు మాత్రం 3 ప్రాంతాలను మాత్రమే అడుగుతున్నామని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa