ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"జగనన్న దమ్ముంటే ఈ 9 ప్రశ్నలకు సమాధానం చెప్పు": షర్మిల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 13, 2024, 07:24 PM

ఏపీ ప్రభుత్వంపైనా, సీఎం వైఎస్ జగన్ మీద ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. ఏపీ ప్రభుత్వం ఇటీవలే ఆరువేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఏపీ ప్రభుత్వం వేసిన ఈ డీఎస్సీ మీద షర్మిల ఫైరయ్యారు. మహానేత వైఎస్ఆర్ 52 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తే.. ఆయన వారసుడిగా చెప్పుకునే జగనన్న ఆరువేల పోస్టులతో దగా డీఎస్సీ వేశారంటూ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. ఇదే క్రమంలో తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్న వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకు సవాల్ అంటూ ఎక్స్‌లో షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు.


 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు 25 వేల టీచర్ పోస్టుల భర్తీ ఎక్కడ అంటూ ప్రశ్నించిన షర్మిల.. ఐదేళ్లు నోటిఫికేషన్ వేయకుండా కాలయాపన ఎందుకు చేశారంటూ ప్రశ్నించారు. ఎన్నికలకు నెలన్నర ముందు 6 వేల పోస్టుల భర్తీ చేయడంలో ఆంతర్యం ఏమిటని నిలదీశారు. అలాగే టెట్, డీఎస్సీ కలిపి నోటిఫికేషన్ ఇస్తే అభ్యర్థులు దేనికి ప్రిపేర్ అవ్వాలని అన్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన 30 రోజుల్లో పరీక్షలు పెట్టడం దేశంలో ఎక్కడైనా ఉందా అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని షర్మిల విమర్శించారు. టెట్ కి 20 రోజులు, తర్వాత డీఎస్సీ మద్య కేవలం 6 రోజుల వ్యవధ్ మాత్రమే ఇవ్వడం ఎంత వరకూ కరెక్ట్ అని ప్రశ్నించారు.


వైఎస్సార్ హయాంలో 100 రోజుల గడువు ఇచ్చిన సంగతి వారసుడు జగన్ కి గుర్తులేదా అని షర్మిల ప్రశ్నించారు. ఇచ్చిన సిలబస్ ప్రకారం ఒక్కో అభ్యర్థి 150 పుస్తకాలు చదవాలని మీకు తెలియదా అని అన్నారు. రోజుకి 5 పుస్తకాలు చదవడం అభ్యర్థులకు సాధ్యపడే పనేనా అని ప్రశ్నించారు. మానసిక ఒత్తిడికి గురిచేసి నిరుద్యోగులను పొట్టన పెట్టుకోవాలని కుట్ర చేస్తున్నారా ? ఇది కక్ష్య సాధింపు చర్య కాదా అంటూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.నవ రత్నాలు, జాతి రత్నాలు అని చెప్పుకొనే జగన్ ..ఆయన చుట్టూ ఉండే మంత్రులు ఈ 9 ప్రశ్నలకు దమ్ముంటే సమాధానం చెప్పాలని షర్మిల ట్వీట్‌లో రాసుకొచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa