ఏపీ శాసనసభ ఎన్నికలను అన్ని పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 2019 ఎన్నికల్లో రికార్డుస్థాయిలో గ్రాండ్ విక్టరీ కొట్టిన వైసీపీ.. ఈసారి కూడా అదే ఫలితాలను రిపీట్ చేయాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు గత ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న సైకిల్ పార్టీకి ఈ ఎన్నికలు చాలా కీలకం. టీడీపీ దీర్ఘకాలిక భవిష్యత్తు ఈ ఎన్నికలపైనే ఆధారపడి ఉందంటే అతిశయోక్తి కూడా కాదు. అలాగే 2019 ఎన్నికల్లో కేవలం ఒకసీటుకే పరిమితమైన జనసేన కూడా ఈ ఎన్నికల్లో సత్తాచాటకపోతే.. ఆ పార్టీ ఉనికే ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే శాసనసభ ఎన్నికల కోసం జనసేనాని పవన్ కళ్యాణ్ మూడంచెల వ్యూహాన్ని అనుసరించనున్నారు. అందుకోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ- జనసేన కలిసి పోటీ చేయనున్నాయి. అయితే ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా మొత్తం 175 నియోజకవర్గాలను చుట్టేసేలా పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ప్రతి జిల్లాలోనూ మూడుసార్లు పర్యటించేలా పవన్ కళ్యాణ్ తన రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. తొలిసారి పర్యటనలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశం కానున్న పవన్.. రెండోసారి వెళ్లినప్పుడు స్థానిక కార్యకర్తలతో భేటీలు నిర్వహించనున్నారు . ఇక మూడోసారి నియోజకవర్గ ప్రజలలోకి వెళ్లి ప్రచారం చేస్తారు. పవన్ పర్యాటనలు ఈ మూడంచెల వ్యూహం ప్రకారం ఉండేలా జనసేన ప్రచార కమిటీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ప్లాన్లో భాగంగా పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 14 నుంచి 17 వరకూ ఉభయగోదావరి జిల్లాలలో పర్యటిస్తారు.
అయితే ఏపీవ్యాప్తంగా విస్తృత స్థాయి పర్యటనల నేపథ్యంలో ఎన్నికల ప్రచారానికి ప్రత్యేక హెలికాప్టర్ వినియోగించాలని జనసేన భావిస్తున్నట్లు సమాచారం. ఉభయ గోదావరి జిల్లాల పర్యటనలకు సైతం హెలికాప్టర్ వాడాలని భావిస్తున్నట్లు తెలిసింది. హెలికాప్టర్ ద్వారా అయితే షెడ్యూల్ ప్రకారం అన్ని ప్రాంతాలను కవర్ చేసే అవకాశం ఉంటుందని జనసేన భావిస్తోందట. అలాగే ఆయా నియోజకవర్గాలలో హెలికాప్టర్ ల్యాండ్ చేసేందుకు అనువైన ప్రాంతాలను కూడా గుర్తించే పనిలో జనసేన ఉన్నట్లు తెలిసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa