పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్ నినో గతేడాది నైరుతి రుతుపవనాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. దీంతో వ్యవసాయం రంగం తీవ్రంగా నష్టపోయింది. అయితే, ఈ ఏడాది ఆ పరిస్థితి ఉండబోదని వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. దేశానికి అన్నం పెట్టే అన్నదాతకు, వ్యవసాయ రంగానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపిందది. ముఖ్యంగా జూన్లో రానున్న నైరుతి రుతుపవనాలు రైతుల కళ్లల్లో ఆనందాన్ని నింపుతాయని ఐఎండీ అంచనా వేస్తోంది. వచ్చే జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య వర్షాలు పుష్కలంగా కురుస్తాయని పేర్కొంది. గత సీజన్లో పడిన వర్షపాతం కంటే కూడా మెరుగ్గా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
పసిఫిక్ మహాసముద్రంలో కొనసాగుతున్న ఎల్ నినో ప్రస్తుతం బలహీనపడిందని, జూన్ నాటికి పూర్తిస్థాయిలో బలహీనపడుతుందని అమెరికా, ఐరోపా వాతావరణ సంస్థలు అంచనావేశాయి. నైరుతి రుతుపవనాలు మొదలయ్యే సమయానికి లానినా పరిస్థితులు ఏర్పడతాయని ఈ సంస్థలు చేపట్టిన అధ్యయనంలో వెల్లడయ్యింది. ఎల్ నినో ఇలాగే కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావం ఉంటుందని.. దీనివల్ల అధిక ఉష్ణోగ్రతలతో పాటు తక్కువ వర్షపాతం, కొన్నిచోట్ల అనుకోని విపత్తులు ఉంటాయని నిపుణులు అంటున్నారు.
ముఖ్యంగా భారత ఉపఖండంపై ఈ ఎల్ నీనో ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా. కానీ ప్రస్తుత పరిస్థితులను గమనిస్తుంటే ఏప్రిల్ నుంచి ఎల్ నినో బలహీనపడి ఆగష్టు నాటికి లానినా బలపడుతుందని భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి మాధవన్ రాజీవన్ తెలిపారు. గతేడాది నైరుతి రుతుపవనాల కాలంలో సాధారణ వర్షపాతం (868.6 మిల్లీమీటర్లు) కంటే తక్కువగా (820 మి..మీ) నమోదైందని, ఈసారి అంతకంటే మెరుగ్గా వర్షాలు ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అయితే, వర్షాలకు లోటులేకపోయినా.. వేసవిలో మాత్రం ఎండలు దంచికొడతాయని అంటున్నారు. గత వేసవి కంటే ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ప్రపంచ వాతావరణ సంస్థ పేర్కొంది మొత్తంగా నైరుతి సకాలంలో వచ్చి మంచి వర్షాన్ని ఇచ్చినప్పటికీ వచ్చే వేసవి మాత్రం తీవ్రంగా కొనసాగుతుంది. దాంతోపాటు తుఫాన్ల తీవ్రత వల్ల కుంభవృష్టి వర్షాలకు ఛాన్స్ ఎక్కువగా ఉందని జాతీయ, అంతర్జాతీయ వాతావరణ నిపుణులు అంటున్నారు.
దేశ జీడీపీలో 14 శాతంగా ఉన్న వ్యవసాయ రంగానికి నైరుతి రుతుపవనాలే ప్రధాన ఆధారం. దేశంలో 70 శాతం వర్షపాతం వీటి ద్వారా లభిస్తుంది. ‘ప్రస్తుతం మేము ఖచ్చితంగా ఏమీ చెప్పలేం.. కొన్ని కొన్ని నమూనాలు లా నినాను సూచిస్తాయిజజ కొన్ని తటస్థ పరిస్థితులను అంచనా వేస్తాయి. అయితే, అన్ని మోడల్స్ ఎల్ నినోకు ముగింపుని సూచిస్తున్నాయి’ అని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శివానంద పాయ్ అన్నారు. ఈ ఏడాది ప్రథమార్ధంలో ఎల్ నినో కొనసాగితే 2023 కంటే ఎండలు తీవ్రంగా ఉంటాయని, బలహీనపడితే గతేడాది కంటే తగ్గుతాయని భారత ట్రాపికల్ మెటీరియాలజీ క్లైమేట్ సైంటిస్ట్ రాక్సీ మాథ్యు కోల్ వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa