వాలంటీర్ ఉద్యోగాలపై ఓ వ్యక్తి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విశాఖ రాజధాని చర్చా కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. తనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారని.. అందులో పెద్దమ్మాయి పీజీ, రెండో అమ్మాయి సివిల్స్కు ప్రిపేర్ అయ్యిందని, ఇక మూడో అమ్మాయి డిగ్రీ పూర్తిచేసిందని ఆ వ్యక్తి వీడియోలో చెప్తున్నారు. ఉద్యోగాలు రాక ముగ్గురూ ఇబ్బంది పడుతుంటే.. వైసీపీ ప్రభుత్వం ముగ్గురికీ వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పుకొచ్చారు. వాలంటీర్లు సేవ చేస్తూ వారు ఏ ఇంటికి వెళ్లినా స్థానికులు దండం పెడుతున్నారంటూ ఆ వ్యక్తి భావోద్వేగానికి గురయ్యాడు. అయితే ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పీజీ, సివిల్స్ చదివిన అమ్మాయిలు కూడా వాలంటీర్ ఉద్యోగం చేస్తున్నారంటూ కొంతమంది నెటిజనం విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించారు. వాలంటీర్ ఉద్యోగాల గురించి మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్.. మరోసారి ఏపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. పేపర్కు ఇచ్చే 200 రూపాయలతో కలిపి వాలంటీర్లకు నెలకు ఐదువేల 200 రూపాయలు ఇస్తున్నారన్న పవన్.. కేవలం ఐదు వేల రూపాయలకు యువశక్తిని ప్రభుత్వం నీరుగారుస్తోందని మండిపడ్డారు. పెద్దపెద్ద చదువులు చదివిన యువతను ఇంత తక్కువ జీతానికే సీఎం జగన్ గ్రామాలలో కట్టిపడేస్తున్నారని ఆరోపించారు. ఏపీలో 33 వేల గ్రామాలు ఉన్నాయని, గ్రామానికి పది మంది చొప్పున లెక్కేసుకున్నా వాలంటీర్ల పేరుతో వీరందరిని కట్టేస్తున్నారని జనసేనాని మండిపడ్డారు. వీరిలో ఎంతోమంది సైంటిస్టులు, వ్యాపారవేత్తలు, ఇంజినీర్లుగా మారే అవకాశం ఉందని, వారిలో దాగున్న ప్రతిభను గుర్తించకుండా ఇలా చేస్తున్నారని ఆరోపించారు.
మరోవైపు యువతలో ఉన్న సామర్ధ్యాన్ని ఏపీ ప్రభుత్వం గుర్తించడం లేదని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. డిగ్రీలు, పీజీలు చదవిన యువతను వాలంటీర్ల పేరుతో ఐదువేలు ఇస్తూ ఊడిగం చేయించుకుంటున్నారని పవన్ విమర్శించారు.డిగ్రీ చదువుకున్న వాళ్లను ఐదువేలకు పనిచేయమంటే అది ఉద్యోగమా.. లేదా ఊడిగమా అంటూ జనసేనాని ప్రశ్నించారు. మరోవైపు బుధవారం పవన్ కళ్యాణ్ భీమవరంలో పర్యటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa