లోక్సభ ఎన్నికల ముందు ఆమ్ ఆద్మీ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మధ్య ఇప్పటికే తీవ్ర మాటల యుద్ధం కొనసాగుతోంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఇప్పటికే బీజేపీపై ఆప్ నేతలు.. ఆప్ నేతలపై బీజేపీ నేతలు పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకుంటున్న వేళ.. అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు నోబెల్ బహుమతి ఇవ్వాలని తెలిపారు. ఈ సందర్భంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నా ఢిల్లీ అభివృద్ధి కోసం తాను నిరంతరం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.
కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని నరేంద్ర మోదీ సర్కారు మొదటి నుంచీ తనపై కక్షపూరిత వైఖరి ప్రదర్శిస్తోందని కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం పాలన అందించకుండా కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకుంటోందని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక ఢిల్లీలో ఇప్పటికే ఎన్నో పాఠశాలలు, ఆస్పత్రులు కట్టి విద్యా, వైద్య రంగాల్లో ఎంతో అభివృద్ధిని సాధించిందని పేర్కొన్నారు. అయితే ఢిల్లీలో తమ ప్రభుత్వం మరిన్ని పాఠశాలలు, ఆస్పత్రులు కట్టకుండా అడ్డుకుంటోందని విమర్శించారు.
బీజేపీ పాలకుల పిల్లలతో సామానంగా సామాన్య ప్రజల పిల్లలు కూడా చదువుకోవడం కేంద్ర ప్రభుత్వ పాలకులకు అస్సలు ఇష్టం లేదని కేజ్రీవాల్ మండిపడ్డారు. బీజేపీ కుట్రలను ఎదుర్కొంటూ ఢిల్లీలో పరిపాలన ఎలా కొనసాగిస్తున్నానో తనకు మాత్రమే తెలుసునని ఢిల్లీ సీఎం చెప్పారు. అందుకుగానూ తనకు నోబెల్ బహుమతి ఇవ్వాలని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే తాజాగా నిర్వహించిన ఓ బహిరంగ సభలో మాట్లాడిన కేజ్రీవాల్.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అఘాయిత్యాలను ఎదిరిస్తూ ఢిల్లీ ప్రభుత్వాన్ని నడుపుతున్న నాకు మీరే నోబెల్ బహుమతులని ప్రజలను ఉద్దేశించి పేర్కొన్నారు. ఢిల్లీలో ఏ గల్లీకి వెళ్లినా ఆమ్ ఆద్మీ పార్టీనే నమ్ముకుంటున్నామని ప్రజలు చెప్పినట్లు తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమే తమ జీవితాలను మార్చాలని ప్రజలు చెబుతున్నారని కేజ్రీవాల్ వివరించారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఢిల్లీ వాసులు సరైన సమాధానం చెబుతారని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa