ఏపీ ప్రజలకు వైసీపీ నుంచి విముక్తి కల్పించాలన్నదే తమ లక్ష్యమని, పవన్ కళ్యాణ్ నిర్ణయాలకు మద్దతుగా ఉంటామని జెండా సభ ద్వారా జనసైనికులు చాటి చెబుతారని, మచిలీపట్నం, గుంటూరు పార్లమెంటు స్థానాలు నుంచి జెండా సభకు తరలి వెళ్తున్నామని ఎంపీ బాలశౌరి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో అధర్మం నాలుగు పాదాల మీద నడుస్తోందని, ఆ పార్టీలో ధర్మం, న్యాయం లేదు కాబట్టే చాలా మంది బయటకు వస్తున్నారని అన్నారు. జనసేన - టీడీపీ సీట్ల సర్దుబాటులో కొన్నిచోట్ల అసంతృప్తులు తలెత్తాయని, అవన్నీ త్వరలో సర్దుకుంటాయన్నారు. ప్రజల్లో వైసీపీ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని, తప్పకుండా టీడీపీ - జనసేన కూటమి విజయం సాధిస్తుందని ఎంపీ బాలశౌరి ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీ 70 శాతం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే.. వైసీపీ ఐదేళ్లలో ఏమీ చేయలేదని తీవ్రస్థాయిలో విమర్శించారు. కనీసం పోలవరం ఎలా పూర్తి చేయాలనే ప్రణాళిక వైసీపీ సర్కారుకు లేదని ఎద్దేవా చేశారు. జల్ జీవన్ మిషన్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు ఇవ్వటం లేదని, మచిలీపట్నం - రేపల్లె రైల్వే లైన్ ప్రాజెక్ట్ దివిసీమ ప్రాంతానికి తీరని కల అని.. దాన్ని నిజం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలో జాతీయ రహదారుల అభివృద్ధిపై దృష్టి సారించామని ఎంపీ బాలశౌరి స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa