ఎన్నికల బాండ్ల రూపంలో పార్టీలకు అందిన విరాళాలకు సంబంధించిన మరో డేటా బహిర్గతమైంది. బాండ్ల ద్వారా బీజేపీకి భారీగా లబ్ది చేకూరినట్టు కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్లో ఆదివారం అందుబాటులోకి వచ్చిన వివరాలు బయటపెట్టాయి. ఆ పార్టీకి రూ.8,718.5 కోట్లు విరాళంగా వచ్చినట్లు డేటాను బట్టి తెలుస్తోంది. ఎన్నికల బాండ్ల పథకం ప్రారంభమైన 2018 మార్చి నుంచి రాజకీయ పార్టీలు నగదుగా మార్చుకున్న వాటి వివరాలను తాజాగా ఈసీ వెబ్సైట్లో ఉంచింది. ఇందులో గుర్తింపు పొందిన, పొందని 523 రాజకీయ పార్టీల సమాచారం ఉంది.
ఈ డేటాతో భారతీయ స్టేట్ బ్యాంకు వెల్లడించిన ఏప్రిల్ 12, 2019 నుంచి 2024 జనవరి 24 మధ్య సమాచారాన్ని పోల్చుకుంటే.. రాజకీయ పార్టీలు అందుకున్న విరాళాల మొత్తాలు రెట్టింపయ్యాయి. తాజా గణాంకాల ప్రకారం.. 2019 ఏప్రిల్ 12కు ముందు బీజేపీకి రూ.2,658.35 కోట్ల విలువైన బాండ్లు రాగా.. ఆ కాలంలో మొత్తం రాజకీయ పార్టీలకు లభించిన విరాళాల్లో 66 శాతం దానికి దక్కాయి. అదే సమయంలో కాంగ్రెస్కు రూ.530.1 కోట్లు వచ్చాయి. మొత్తంగా హస్తం పార్టీ విరాళాలు రూ.1,864.45 కోట్లుగా తేలింది.
ఇక, 2019 ఏప్రిల్ 12కు ముందు తృణమూల్ కాంగ్రెస్ రూ.97.28 కోట్ల విలువైన బాండ్లను నగదుగా మార్చుకుంది. ఆ పార్టీ మొత్తం విరాళాలు రూ.1,494.28 కోట్లు. బీఆర్ఎస్ ఎన్నికల బాండ్ల కింద మొత్తం మీద రూ.1,408.20 కోట్ల విరాళాలు అందుకుంది. ఇక, అత్యధికంగా ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసిన ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్.. తమిళనాడులోని అధికార డీఎంకేకు రూ.509 కోట్ల విలువైన బాండ్లను అందజేసింది. దీంతో పాటు డీఎంకేకు మేఘా ఇంజినీరింగ్ రూ.105 కోట్లు, ఇండియా సిమెంట్స్ రూ.14 కోట్లు, సన్ టీవీ రూ.100 కోట్లు విరాళాలు అందించాయి. దేశంలో అత్యధికంగా రూ.1,368 కోట్లు విలువైన ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసిన ఫ్యూచర్ గేమింగ్.. ఇందులో రూ.509 కోట్లు డీఎంకేకు ఇచ్చింది. కానీ, మిగిలిన రూ.859 కోట్లను ఏ రాజకీయ పార్టీలకు విరాళంగా ఇచ్చిందో మాత్రం స్పష్టత లేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa