ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నడిసంద్రంలో 40 గంటల ఆపరేషన్‌.. సోమాలియా దొంగల ఆటకట్టించిన భారత నేవీ

national |  Suryaa Desk  | Published : Mon, Mar 18, 2024, 10:45 PM

సోమాలీయా తీరంలో సముద్రపు దొంగల చేతిలో హైజాక్‌కు గురైన ఓ వాణిజ్య నౌక ఎంవీ రుయెన్‌ను విడిపించడానికి భారత నౌకాదళం భారీ ఆపరేషన్ చేపట్టింది. అరేబియా సముద్రంలో దాదాపు 40 గంటలపాటు సాగిన ఈ సాహసోపేత ఆపరేషన్‌‌‌తో సోమాలియా దొంగల ఆటకట్టించింది. ఆపరేషన్‌లో భాగంగా వాయుసేనకు చెందిన సీ-17 యుద్ధ విమానం నుంచి బోట్లను సముద్రంలో జారవిడిచి, మెరైన్‌ కమాండో లను రంగంలోకి దింపింది. ఈ ఆపరేషన్‌ గురించి భారత నౌకాదళం ట్విట్టర్‌లో వెల్లడించింది.


 గతేడాది డిసెంబరులో మాల్టా జెండాతో కూడిన వాణిజ్య నౌకను సముద్రపు దొంగలు హైజాక్‌ చేశారు. దీనిని పలు దేశాలకు చెందిన నౌకలను దోచుకునేందుకు ఉపయోగిస్తున్నారని భారత నేవీ గుర్తించింది. దీంతో ఆ నౌకను రక్షించేందుకు మార్చి 16న భారీ ఆపరేషన్ చేపట్టింది. ఇందులో భాగంగా ఐఎన్‌ఎస్‌ కోల్‌కతా, ఐఎన్‌ఎస్‌ సుభద్రలతోపాటు సీ గార్డియన్‌ డ్రోన్లను మోహరించింది. భారత తీరానికి దాదాపు 1400 నాటికల్ మైళ్ల (2600) దూరంలో వైమానిక దళం ‘సీ-17’ సరకు రవాణా విమానం ద్వారా రెండు చిన్నపాటి యుద్ధ బోట్లను కచ్చితమైన ప్రదేశంలో జారవిడిచింది.


అనంతరం మెరైన్‌ కమాండోలూ కిందికి దిగి.. సముద్రపు దొంగల ఆటకట్టించారు. మొత్తం 17 మంది బందీలను విడిపించి.. 35 మంది పైరట్లను అదుపులోకి తీసుకున్నారు. రూ.8 కోట్లకుపైగా విలువైన 37,800 టన్నుల సామగ్రితో కూడిన ఆ నౌకను తీరానికి చేర్చుతామని నేవీ వెల్లడించింది. నేవీ, ఎయిర్‌ఫోర్స్ సంయుక్త కార్యాచరణ శక్తిసామర్థ్యాలను ఈ విజయం ప్రదర్శిస్తోందని పేర్కొంది. అంతర్జాతీయ జలాల్లో శాంతి, స్థిరత్వాలను బలోపేతం చేయడంతోపాటు దోపిడీని అడ్డుకోవడంలో భారత బలగాల నిబద్ధతను చాటుతుందని చెప్పింది.


‘‘మార్చి 15 ఉదయం ఐఎన్ఎస్ కోల్‌కతా.. వాణిజ్య నౌక రుయెన్‌కు సమీపంగా చేరుకుని.. డ్రోన్ ద్వారా సాయుధ సముద్రపు దొంగల ఉనికిని నిర్ధారించింది.. పైరేట్‌లు డ్రోన్‌ను కూల్చివేసి.. భారత నౌకాదళ యుద్ధనౌకపై కాల్పులు జరిపారు.. భారత ప్రధాన భూభాగం నుంచి 1400 నాటికల్ మైళ్ల (2600 కి.మీ.) దూరంలోని యాంటీ పైరసీ ఆపరేషన్‌‌ను మార్చి 16న భారత నావికాదళం చేపట్టింది. ఐఎన్ఎస్ సుభద్రను మోహరించి, మెరైన్ కమాండోలను వైమానికదళ విమానం నుంచి దింపి సముద్ర దొంగలను అదుపులోకి తీసుకున్నాం’’ అని నేవీ తెలిపింది. ఇదిలా ఉండగా.. గాజాపై ఇజ్రాయేల్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై కొంతకాలంగా హూతీ తిరుగుబాటుదారుల దాడులకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా జలమార్గాలపై నిఘా ఉంచేందుకు భారత్ 10కి పైగా యుద్ధనౌకలను మోహరించింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa