రాజస్థాన్లో సోమవారం తెల్లవారుజామున రైలు ప్రమాదం సంభవించింది. అజ్మేర్ సమీపంలో సబర్మతి- ఆగ్రా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మదార్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఇంజిన్, నాలుగు బోగీలు పట్టాలు తప్పినట్టు అధికారులు తెలిపారు. ప్రయాణికులు గాఢనిద్రలో ఉండగా ప్రమాదం చోటుచేసుకోవడంతో ఏం జరిగిందో తెలియక భయపడిపోయారు. ఇప్పటి వరకూ ప్రాణనష్టం గురించి ఎటువంటి సమాచారం లేదు.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రులకు తరలించారు. పలువురు ప్రయాణికులు మాత్రం తమకు స్వల్పగాయాలైనట్టు తెలిపారు. గాయపడినవారికి అజ్మేర్ ఆస్పత్రిలో చికిత్స అందజేస్తున్నారు. గాఢనిద్రలో ఉండగా ఒక్కసారి భారీ శబ్దం రావడంతో ఉలిక్కిపడి లేచామని ప్రయాణికులు తెలిపారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదానికి గురైన ఇంజిన్, బోగీలను పట్టాలపైకి ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa