నకిలీ ఎన్కౌంటర్ కేసులో మాజీ పోలీస్ అధికారికి బాంబే హైకోర్టు మంగళవారం జీవితఖైదు విధించింది. ముంబయి మాఫియా లీడర్ ఛోటారాజన్ అనుచరుడు రామనారాయణ అలియాస్ లఖన్ భయ్యా 18 ఏళ్ల కిందట ఎన్కౌంటర్లో హతమయ్యాడు. అయితే, ఇది నకిలీదని నిర్దారణ కావడంతో అప్పటి పోలీస్ అధికారి, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ప్రదీప్ శర్మను హైకోర్టు దోషిగా నిర్దారించింది. ఆయనకు యావజ్జీవిత శిక్షను ఖరారుచేసిన న్యాయస్థానం.. మూడు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది. ఎన్కౌంటర్ కేసులో ఓ పోలీస్ అధికారి దోషిగా నిర్దారణ కావడం మహారాష్ట్రలో ఇదే తొలిసారి. ‘రామనారాయణ అలియాస్ లఖన్ భయ్యాను ఉద్దేశపూర్వకంగానే పోలీసులు చంపినట్టు ప్రాసిక్యూషన్ రుజువు చేసింది... బూటకపు ఎన్కౌంటర్కు నిజమైందనే రంగు పూశారని స్పష్టంగా తెలుస్తుంది’ అని జస్టిస్ రేవతి మోహితే డేరే, జస్టిస్ గౌరి గోడ్సేల ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ మేరకు ప్రదీప్ శర్మను నిర్దోషిగా పేర్కొంటూ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును తప్పుబట్టింది.
‘చట్టాన్ని రక్షించేవాళ్లు యూనిఫామ్ ముసుగులో నేరస్థులుగా వ్యవహరించడానికి అనుమతించదు.. ఒకవేళ అలా అనుమతిస్తే అది అరాచకానికి దారితీస్తుంది.. ప్రదీప్ శర్మకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలను గుర్తించడంలో సెషన్స్ కోర్టు విఫలమైంది.. నిర్దోషిగా నిర్దారించింది’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. కేసు వివరాల్లోకి వెళ్తే.. ఛోటారాజన్ అనుచరుడు రామనారాయణ్ అలియాస్ లఖన్ భయ్యా.. అతడి స్నేహితుడు అనిల్ భేడాలను 2006 నవంబరు 11న వాసాయ్లో అపహరించారు. అనంతరం ఆంధేరి సమీపంలోని వెర్సొవాలోని పార్క్ వద్ద ఎన్కౌంటర్ చేశారు. మాజీ పోలీస్ అధికారి ప్రదీప్ శర్మ అతడిపై ఐదు రౌండ్ల కాల్పులు జరిపినట్టు సిట్ విచారణలో వెల్లడయ్యింది.
హైకోర్టు తీర్పుపై రామనారాయణ్ సోదరుడు లాయర్ రామప్రసాద్ హర్షం వ్యక్తం చేశాడు. ‘చివరకు న్యాయం జరిగింది.. డబ్బు, అధికారం వల్ల న్యాయం ఆలస్యమైంది కానీ చివరకు గెలిచింది’ అని అన్నాడు. ఈ కేసులో 22 మందిని నిందితులుగా చేర్చారు. వారిపై కిడ్నాప్, హత్య, నేరపూరిత కుట్ర సహా పలు కేసులను నమోదుచేశారు. చివరకూ హైకోర్టు 12 మంది పోలీసు అధికారుల దోషులుగా నిర్దారించింది. ఆరుగురు పౌరులను నిర్దోషులుగా విడుదల చేసింది.
ట్రయల్ కోర్టు తీరుపై మండిపడింది. స్పష్టమైన ఆధారాలున్నా నిందితులను నిర్దోషిగా ప్రకటించిందని పేర్కొంది. 2013లో సెషన్స్ కోర్టు సాక్ష్యాలు లేని కారణంగా శర్మను నిర్దోషిగా ప్రకటించింది. మరో 21 మంది నిందితులను దోషులుగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. 21 మంది నిందితుల్లో ఇద్దరు కస్టడీలోనే మరణించారు. ఇక, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా పేరు సంపాదించిన మాజీ పోలీస్ అధికారి ప్రదీప్ శర్మ.. తన 25 ఏళ్ల సర్వీసులో 112 మంది క్రిమినల్స్ను మట్టుబెట్టారు. ప్రదీప్ శర్మ గతంలో ముఖేశ్ అంబానీ నివాసం ఆంటీలియా ఎదుట పేలుడు పదార్థాలు లభ్యమైన కేసులోనూ, మన్సుఖ్ హిరేన్ హత్య కేసులోనూ నిందితుడిగా ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa