ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో సార్వత్రిక సమరం బుధవారం నుంచి ప్రారంభం కాబోతోంది. మొత్తం 543 పార్లమెంట్ స్థానాలకు ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తుండగా.. తొలి విడతలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో తొలిదశకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనుంది. ఆ వెంటనే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ మార్చి 27 కాగా.. 28న పరిశీలన ఉంటుంది. ఈ నెల 30లోగా ఉపసంహరణకు గడువు ఉంటుంది.
ఏప్రిల్ 19న 102 నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్ నిర్వహిస్తారు. తొలిదశ ఎన్నికల్లో తమిళనాడులోని 39, రాజస్థాన్లోని 12, ఉత్తర్ ప్రదేశ్లోని 8, మధ్యప్రదేశ్లో 6, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, అసోంలో ఐదుచొప్పున, బిహార్లోని 4, పశ్చిమ్ బెంగాల్లోని 3, అరుణాచల్ ప్రదేశ్, మణిపుర్, మేఘాలయల్లో రెండేసి, ఛత్తీస్గఢ్, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్మూ కశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిల్లో ఒక్కొక్కటి ఉన్నాయి.
లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం శాసనసభలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అదేవిధంగా దేశంలోని ఖాళీ అయిన 26 అసెంబ్లీ స్థానాలకు సైతం షెడ్యూల్ విడుదలైంది. ఇక, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీతో పాటు లోక్సభ, తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు నాలుగో దశలో నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 18న విడుదల కానుండగా పోలింగ్ మే 13న జరుగుతుంది.
ఏప్రిల్ 19న తొలి దశలో 102 నియోజకవర్గాలు, (21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం), ఏప్రిల్ 26న రెండో దశలో 89 సీట్లు (13 రాష్ట్రాలు), మే 7న మూడో దశలో 94 స్థానాలు (12 రాష్ట్రాలు), మే 13 నాలుగో దశలో 96 (10 రాష్ట్రాలు), మే 20న ఐదో దశలో 49 పార్లమెంట్ స్థానాలు, మే 25న ఆరో దశలో 57 సీట్లు (8 రాష్ట్రాలు), జూన్ 1న ఏడో దశలో 57 స్థానాలకు (8 రాష్ట్రాలు) పోలింగ్ నిర్వహిస్తారు. జూన్ 4 ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa