ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూపీ చిన్నారుల హత్య ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు

national |  Suryaa Desk  | Published : Wed, Mar 20, 2024, 10:45 PM

యూపీలోని బదౌనిలో మంగళవారం సాయంత్రం జరిగిన ఇద్దరు చిన్నారుల హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పిల్లలు ఆడుకుంటుండగా వారి ఇంటిలోకి ప్రవేశించిన నిందితుడు.. గొంతుకోసి హత్య చేసిన విషయం తెలిసిందే. నిందితుడ్ని సాజిద్‌గా గుర్తించిన పోలీసులు.. బాధితులు ఇంటి ఎదురుగా సెలూన్ షాపు నిర్వహిస్తున్నాడని చెప్పారు. చనిపోయిన చిన్నారుల తండ్రి వినోద్‌తో అతడి పరిచయం ఉందని తెలిపారు. రూ.5 వేల అవసరం పడటంతో అప్పుకోసం మంగళవారం సాయంత్రం వారి ఇంటికి వెళ్లాడని, అయితే ఆ సమయానికి వినోద్ లేడని అన్నారు. వినోద్ భార్య కిచెన్‌లో ఉండగా.. వారి ముగ్గురు పిల్లలపై దాడిచేశాడని వివరించారు.


బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం.. వినోద్ ఇంటికి వెళ్లిన సాజిద్.. గర్భవతి అయిన తన భార్య ఆస్పత్రిలో ఉందని, రూ.5 వేలు కావాలని అడిగాడు. దీంతో వినోద్ భార్య సంగీత తన భర్తకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పింది. అనంతరం ఆమె కిచెన్‌లోకి వెళ్లి టీ పెడుతుండగా.. ముగ్గురు పిల్లలు ఆడుకుంటుున్నారు. వీరిలో 12 ఏళ్ల కుమారుడు ఆయూష్‌ను మీ అమ్మ బ్యూటీపార్లర్ తనకు చూపించాలని సాజిద్ రెండో అంతస్తుకు తీసుకెళ్లాడు. అక్కడకు వెళ్లిన తర్వాత లైట్లు ఆర్పేసి ఆయూష్‌పై గడ్డం గీసే కత్తితో దాడిచేసి, గొంతుకోశాడు. ఈ దాడిని చూసిన ఆరేళ్ల బాలుడు ఆహాన్‌‌ను కూడా చంపేశాడు. మరో చిన్నారి పియూష్ మాత్రం స్వల్పగాయాలతో తప్పించుకున్నాడు. కిందకు పరుగెత్తుకొచ్చి సంగీతను అప్రమత్తం చేశాడు.


‘సాజిద్‌తో మాకు ఎలాంటి గొడవలు లేవు.. అతడు ఇంటికి వచ్చే సమయానికి నేను పనిమీద బయటకు వెళ్లాను.. రూ.5 వేలు అప్పు కావాలని నా భార్యను అడిగాడు.. ఆమె నాకు ఫోన్ చేసి అనుమతి తీసుకుని ఇచ్చింది.. బ్యూటీపార్లర్ల్ చూపించాలని తీసుకెళ్లి కత్తితో దాడిచేశాడు.. నా ముగ్గురు కుమారుల్లో ఒకరు తప్పించుకుని నా భార్యను అప్రమత్తం చేశారు’ అని వినోద్ కన్నీటిపర్యంతమయ్యాడు.


కాగా, హత్య తర్వాత తన సోదరుడు జావేద్‌తో కలిసి సాజిద్ పరారయ్యాడని పోలీసులకు బాధిత కుటుంబం చెప్పింది. సాజిద్ లోపలికి వెళ్లేటప్పుడు ఆ ఇంటి బయట జావేద్ ఉన్నాడని, ఈ దారుణాల వెనుక ఇద్దరూ ఉన్నారని ఆరోపించింది. తప్పించుకున్న సాజిద్.. పోలీసులపై దాడికి యత్నించడంతో అతడ్ని ఎన్‌కౌంటర్ చేశారు. ఈ ఘటనలో ఓ ఎస్సైకి గాయాలయ్యాయి. ప్రస్తుతం పరారీలో ఉన్న జావేద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే, హత్య దారితీసిన కారణాలు మాత్రం తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa