తిరుపతిలోని బర్డ్ ట్రస్టుకు భారీ విరాళం అందింది. ముంబైకి చెందిన కమల్ ఝున్ఝున్వాలా, బాల సుదర్శనరెడ్డి బర్డ్ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం అందజేశారు. తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో శనివారం ఉదయం దాతలు ఈ విరాళానికి సంబంధించిన చెక్కును బర్డ్ ఆసుపత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ రెడ్డప్పరెడ్డికి అందించారు.
తిరుపతిలోని బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ, రీసెర్చ్ అండ్ రీహ్యబిలిటేషన్ ఫర్ డిసేబుల్డ్ (BIRRD)ను బర్డ్ ఆస్పత్రిగా పిలుస్తారు. పోలియో మైలిటిస్, సెరబ్రల్ పల్సీ, పుట్టుకతో వచ్చే వైకల్యం, వెన్నెముక గాయాలు వంటి సమస్యలతో బాధపడుతున్నవారికి, ముఖ్యంగా పేదలకు, ఇక్కడ వైద్య చికిత్స, సౌకర్యాలు అందిస్తారు.1994లో బర్డ్ను ట్రస్ట్గా మార్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఏటా ఈ ట్రస్టుకు నిధులను సమకూరుస్తూ వస్తోంది. ఇక పేద ప్రజలకు ఆస్పత్రి అందిస్తున్న సేవలను అభినందిస్తూ బర్డ్ ట్రస్టుకు దాతలు విరాళం అందిస్తుంటారు. అలా వచ్చిన విరాళాలతో పాటుగా టీటీడీ ట్రస్టు.. బర్డ్ ట్రస్టుకు ఏటా గ్రాంటు విడుదల చేస్తూ వస్తోంది.
బర్డ్ ట్రస్ట్ కింద 250 పడకల సామర్థ్యంతో విశాలమైన ఆస్పత్రి రోగులకు సేవలు అందిస్తోంది. సుమారు నాలుగున్నర కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. ఇందులో ఐదు ఆపరేషన్ థియేటర్లు, కృత్తిమ అవయవాలను అమర్చే కేంద్రం, అధునాతన ఫిజియోథెరపీ విభాగం ఉన్నాయి. ప్రస్తుతం బర్డ్ యాజమాన్యం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న పోలియోతో బాధపడుతున్న చిన్నారుల సమాచారాన్ని సేకరిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత జిల్లాల వారీగా పేషంట్లను పరీక్షిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa