తెనాలి మహిళ గీతాంజలి మరణం ఏపీ రాజకీయాల్లో ఇటీవల ఎంత హాట్ టాపిక్గా మారిందో అందరికీ తెలిసిందే. దీనిపై అధికార వైసీపీ, విపక్ష తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పెద్ద వారే నడిచింది. సోషల్ మీడియా మొత్తం రెండు వర్గాలుగా మారిపోయి.. కామెంట్లు, పోస్టులు పెడుతూ వచ్చింది. ఇక ఈ ఘటనపై ప్రభుత్వం సైతం స్పందించింది. గీతాంజలి కుటుంబానికి పరిహారం కూడా అందించింది. అంతేకాదు ఆమె మరణంపై దర్యాప్తును సైతం ఏపీ పోలీసులు ప్రారంభించారు. అయితే గీతాంజలి కుటుంబానికి సినీ రచయిత కోన వెంకట్ మద్దతుగా నిలిచారు. ఆ కుటుంబానికి అండగా ఉంటానని ప్రకటించారు. సోమవారం తెనాలిలోని గీతాంజలి ఇంటికి వెళ్లిన కోన వెంకట్.. ఆ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.
అనంతరం గీతాంజలి కుటుంబానికి కోన వెంకట్ రూ.50 వేలు ఆర్థికసాయం అందజేశారు. గీతాంజలి ఇద్దరు కుమార్తెలను తన సొంత కూతుళ్లలాగా చూసుకుంటానని భరోసా ఇచ్చారు. ఇప్పటి నుంచి వారి బాధ్యత తనదని చెప్పిన కోన వెంకట్.. ఇప్పటినుంచి తనకు నలుగురు కూతుర్లని చెప్పారు. గీతాంజలి కుటుంబానికి ఏ సహాయం అవసరమైనా ముందుంటానని చెప్పారు. సోషల్ మీడియా శాడిజానికి గీతాంజలి బలైందన్న కోన వెంకట్.. ఆ విషయంలో తాను కూడా బాధితుడినేనని చెప్పారు. సోషల్ మీడియా వేధింపులను నివారించేందుకు ప్రభుత్వాలు కొత్త చట్టాలు తేవాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ఏపీ ప్రభుత్వం నుంచి తెనాలికి చెందిన మహిళ గీతాంజలికి ఇటీవల ఇంటి పట్టా వచ్చింది. ఈ పట్టా అందుకున్న ఆనందంలో ఓ మీడియా ఛానెల్తో గీతాంజలి తన ఆనందాన్ని పంచుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఆ తర్వాత రైలు పట్టాలపై పడి గీతాంజలి ప్రాణాలు కోల్పోయింది. తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. దీంతో టీడీపీ, జనసేన ట్రోలింగ్ కారణంగానే గీతాంజలి ఆత్మహత్య చేసుకుందని వైసీపీ శ్రేణులు ఆరోపించాయి. అయితే గీతాంజలి వీడియో వైరల్ కాకముందే తనకు ప్రమాదం జరిగిందని టీడీపీ చెబుతోంది. ఎవరో ఇద్దరు వ్యక్తులు ఆమెను రైలు పట్టాలపై తోసేసినట్లు ఓ వీడియోను సైతం రిలీజ్ చేసింది.
మరోవైపు గీతాంజలి మరణంపై అప్పట్లో పెద్దఎత్తున చర్చ జరగ్గా .. ప్రభుత్వం సైతం స్పందించి రూ.20 లక్షలు పరిహారం ప్రకటించింది. ఆ తర్వాత పలువురు మంత్రులు గీతాంజలి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఇక గీతాంజలి మరణంపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. అరెస్ట్లు సైతం చేశారు. తాజాగా రచయిత కోన వెంకట్ సైతం ఆ కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటానని ధైర్యం చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa