ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనకాపల్లి ఎంపీ సీటుకు వైసీపీ అభ్యర్థి ప్రకటన.. తండ్రీ కూతురికి బంపరాఫర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 26, 2024, 07:32 PM

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వైసీపీ అభ్యర్థుల జాబితాను పూర్తి చేసింది. ఇప్పటికే 175 అసెంబ్లీ, 24 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. తాజాగా పెండింగ్‌లో ఉన్న అనకాపల్లి ఎంపీ సీటుకు సైతం అభ్యర్థిని ప్రకటించింది. అనకాపల్లి లోక్‌సభ స్థానానికి డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు పేరును వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఖరారు చేశారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. బూడి ముత్యాలనాయుడు ప్రస్తుతం మాడుగుల సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మాడుగుల అసెంబ్లీకి బూడి ముత్యాలనాయుడు కుమార్తె అనురాధను వైసీపీ అధిష్ఠానం ఇంచార్జిగా నియమించింది. అనకాపల్లి ఎంపీగా కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన బూడి ముత్యాలనాయుడును బరిలోకి దింపుతోంది.


మరోవైపు అనకాపల్లి ఎంపీ సీటుకు ఎన్డీయే కూటమి తరుఫున సీఎం రమేష్ పోటీ చేస్తు్న్నారు. బీజేపీ తరుఫున సీఎం రమేష్ బరిలో నిలవనున్నారు. వైఎస్ఆర్ జిల్లాకు చెందిన సీఎం రమేష్.. గతంలో టీడీపీ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. అనంతరం బీజేపీలో చేరారు. తాజాగా ఆయనను అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం బరిలో నిలిపింది. ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. పొత్తులో భాగంగా బీజేపీకి ఆరు ఎంపీ, 10 ఎమ్మెల్యే సీట్లు కేటాయించారు. అందులో అనకాపల్లి ఎంపీ సీటు కూడా బీజేపీ కోటాలోకి వెళ్లింది.


ప్రస్తుతం అనకాపల్లి ఎంపీగా వైసీపీ నేత సత్యవతి కొనసాగుతున్నారు. అయితే మరోసారి ఆమెను అనకాపల్లి ఎంపీగా పోటీ చేయించేందుకు వైసీపీ అధిష్టానం ఆసక్తి చూపించలేదు. దీంతో కొప్పుల వెలమ సామాజికవర్గానికి చెందిన బూడి ముత్యాల నాయుడుకు అవకాశం ఇచ్చారు. దీంతో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు వైసీపీ అభ్యర్థుల ప్రకటనను పూర్తి చేసింది. అభ్యర్థుల ఎంపిక పూర్తి కావటంతో సీఎం జగన్ రేపటి నుంచి (మార్చి 27 ) మేమంతా సిద్ధం పేరుతో బస్సుయాత్రకు కూడా రెడీ అయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa