ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎయిర్‌పోర్ట్ రన్‌వేపై ఢీకొట్టుకున్న రెండు విమానాలు.. విరిగిపోయిన రెక్కలు

national |  Suryaa Desk  | Published : Wed, Mar 27, 2024, 09:59 PM

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఒకే రన్‌ వేపైకి రెండు విమానాలు వచ్చి ఢీకొట్టుకోవడం తీవ్ర సంచలనంగా మారింది. కోల్‌కతా విమానాశ్రయంలో బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే రెండు విమానాలు ఢీకొన్న ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆగి ఉన్న విమానాన్ని మరో విమానం ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్-డీజీసీఏ పేర్కొంది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన డీజీసీఏ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది.


ఎయిర్‌ ఇండియాకు చెందిన విమానం చెన్నైకి వెళ్తుండగా.. మరో ఇండిగో విమానం దర్భంగాకు బయలు దేరేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే టేకాఫ్, ల్యాండింగ్‌కు ముందు విమానాలు మెల్లగా కదిలే ట్యాక్సీయింగ్ ప్రాంతంలో ఆగి ఉన్న ఎయిర్ ఇండియా విమానాన్ని.. ఇండిగో విమానం వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు విమానాల రెక్కలు విరిగిపోయాయి. రన్‌వే మీదకు వచ్చేందుకు క్లియరెన్స్ కోసం ఆ విమాన సిబ్బంది ఎదురుచూస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.


ఈ క్రమంలోనే ఎయిర్‌ ఇండియా విమానంలో ఆరుగురు క్యాబిన్‌ సిబ్బందితో పాటు 163 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు వెల్లడించారు. మరో ఇండిగో విమానంలో ఆరుగురు క్యాబిన్ సిబ్బందితో పాటు 149 మంది ప్రయాణికులు ఉన్నారని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో రెండు విమానాల్లో ఉన్న ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని డీజీసీఏ పేర్కొంది. ఈ ఘటనపై విచారణకు డీజీసీఏ ఆదేశించింది. రెండు విమానాల పైలట్లను విధుల నుంచి తప్పించినట్లు ఎయిర్ ఇండియా, ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థలు ప్రకటన విడుదల చేశాయి. ఈ సంఘటనతో ప్రయాణికులకు.. వేరే విమానాల్లో గమ్యస్థానాలకు పంపించినట్లు తెలిపాయి. జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని ప్రకటించాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa