విశాఖ మధురవాడలో దారుణం జరిగింది. ఓ విద్యా సంస్థలో లైంగిక వేధింపుల కారణంగా ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
అనకాపల్లి జిల్లా నాతవరం మండలానికి చెందిన వ్యవసాయ కూలీకి ముగ్గురు కుమార్తెలు కాగా.. పెద్ద కుమార్తెకు వివాహమైంది. రెండో కుమార్తె కొమ్మాదిలోని ఓ ప్రైవేటు కాలేజీలో డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజినీరింగ్ (సీఎంఈ) ఫస్టియర్ విద్యార్థిని గురువారం అర్ధరాత్రి దాటాక కాలేజీ హాస్టల్ నాలుగో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. రక్తం మడుగులో పడి ఉన్న ఆమెను సిబ్బంది ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. మృతురాలి మొబైల్ను సీజ్ చేసి అందులోని డేటాతోపాటు, కాలేజీ సీసీ టీవీ ఫుటేజీలు సేకరించి దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఆత్మహత్యకు పాల్పడడానికి ముందు విద్యార్థిని తన అక్కతో వాట్సాప్లో చాట్ చేసింది. తాను చదువుతున్న కాలేజీలో బోధన సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడ్డారని.. అందువల్లే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు చెప్పింది. తొందరపడి ఏమీ చేసుకోకు అని అక్క ధైర్యం చెబుతూ వచ్చింది. అర్ధరాత్రి 1.01 గంటలకు చాటింగ్ చేసుకోగా.. ఆ తర్వాతే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు సోదరి చెబుతున్నారు. అమ్మా.. నాన్న.. ఆరోగ్యం జాగ్రత్త. అక్కా-బావకు అభినందనలు.. అక్కా పండంటి బిడ్డకు జన్మనివ్వు. చెల్లీ.. నీ ఫ్యూచర్పై ఫోకస్ పెట్టు.. చదువుల్లో ఏది ఇష్టమైతే అది చెయ్యి అంటూ ఆమె చెప్పింది.
చనిపోయిన విద్యార్థిని చివరిగా పంపిన మెసేజ్ చూపుతూ కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. తమకు న్యాయం చేయాలంటూ కేజీహెచ్ మార్చురీ దగ్గర ఆందోళన చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి, సత్వరం నివేదిక అందించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు గొండు సీతారాం అధికారుల్ని ఆదేశించారు. విద్యార్థిని ఆత్మహత్య విషయాన్ని సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్ స్పందించారు. విద్యార్థినిపై వేధింపులేవీ జరగలేదని.. తరగతిలో పాఠాలు అర్థం కావడం లేదని తనకు పలుమార్లు చెప్పిందన్నారు. ఆమె చదివే తరగతిలో ఇద్దరు తప్పితే, మిగిలిన వారంతా మహిళా సిబ్బందే బోధిస్తున్నారన్నారు.
తాను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఈ కళాశాలలో లైంగిక వేధింపులు జరుగుతున్నాయన్నారు. ఫ్యాకల్టీకి చెప్పొచ్చు కదా.. అని అందరూ అనొచ్చని.. కానీ వారే దానికి పాల్పడుతుంటే ఇంకెవరికి చెప్పగలమన్నారు. చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని.. ఇక్కడ తనలా చాలామంది అమ్మాయిలు ఎవరికీ చెప్పుకోలేక బాధ పడుతున్నారన్నారు. ఎవరికైనా ఫిర్యాదు చేస్తే తమ ఫొటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని బెదిరిస్తున్నారన్నారు. ఈ పరిస్థితిలో తమలో ఎవరో ఒకరు చనిపోతే ఈ విషయం బయటి ప్రపంచానికి తెలుస్తుందని.. అందుకే ఆత్యహ్య చేసుకుంటున్నానని.. 'నాన్నా.. నీకు ఒక మంచి కుమార్తెను కాలేకపోయినందుకు క్షమించు' అంటూ వాట్సాప్లో మెసేజ్ అక్కకు పంపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa