ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందుకే షర్మిలను చూసి జగన్ భయపడ్డారు.. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు: వైఎస్ సునీత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 02, 2024, 08:10 PM

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు.. ఆ తర్వాతి పరిణామాలను ప్రజలు గ్రహిస్తున్నారన్నారు సునీతా రెడ్డి. ఎవరినైనా ఒకసారి మోసం చేయవచ్చు.. పదేపదే చేయలేరని గ్రహించాలన్నారు. తాను, వైఎస్‌ షర్మిల ఎవరి ప్రభావంతోనో మాట్లాడుతున్నామంటున్నారని.. తన తండ్రి హత్య జరిగాక తనతో తోలుబొమ్మలాట ఆడుకున్నారని వైఎస్ జగన్ టార్గెట్‌గా విమర్శలు చేశారు. గతంలో వారిని గుడ్డిగా నమ్మి చెప్పినట్లు చేయాల్సి వచ్చిందని.. వాస్తవాలేంటో ప్రజలకు తెలుసన్నారు. ప్రతిసారి అందరినీ మోసం చేయలేరని గుర్తుపెట్టుకోవాలని..అన్నగా తనకు సమాధానం చెప్పలేకపోయినా ఫర్వాలేదు.. సీఎంగానైనా చెప్పాలన్నారు సునీతా రెడ్డి.


వైఎస్సార్‌సీపీ పునాదులు రక్తంతో తడిసిపోయాయని.. ప్రతి ఒక్కరూ వైఎస్సార్సీపీ నుంచి బయటకు రావాలన్నారు. లేకపోతే ఆ పాపం చుట్టుకుంటుందని.. అందరూ ధైర్యాన్ని ఓటు ద్వారా చూపిద్దామన్నారు. తన అన్న పార్టీకి ఓటు వేయొద్దు, జగనన్న పార్టీని ఎన్నికల్లో గెలవనీయకూడదన్నారు. తన తండ్రిని హత్య చేసిన వారికి, చేయించిన వారికి శిక్ష పడాలన్నారు సునీత. వివేకానందరెడ్డికి జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదని.. వైఎస్సార్‌సీపీకి ఓటు వేయొద్దని, వచ్చే ఎన్నికల్లో ప్రస్తుత ప్రభుత్వాన్ని దించాలని పిలుపునిచ్చారు. తండ్రిపోయిన బాధలో తల్లడిల్లుతున్న కుమార్తె ఒకవైపు, చంపినవాళ్లు, చంపించినవాళ్లు, వాళ్లను కాపాడుతున్నవాళ్లు మరోవైపు ఉన్నారన్నారు.


వైఎస్ షర్మిల కడప ఎంపీగా పోటీ చేస్తున్నారని తెలిసిందని.. ఆమెకు సునీత శుభాకాంక్షలు తెలిపారు. షర్మిలను కలిసి సంఘీభావం తెలియజేయాలనుకున్నా.. ఇవాళ కోర్టుకు రావాల్సి వచ్చిందన్నారు. జగనన్న జైలుకు వెళ్లిన సమయంలో షర్మిల పాదయాత్ర చేశారని.. ఆ తర్వాత ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించిన విషయాన్ని సునీత గుర్తు చేశారు. కష్టపడి పనిచేసి గెలిపించిన షర్మిలను చూసి జగన్ భయపడ్డారన్నారు. తనకంటే షర్మిలకు మంచి పేరు వస్తుందని జగన్ భయపడ్డారన్నారు.


తనకు ఓ లక్ష్యం ఉందని.. కడపలో అవినాష్ రెడ్డిని ఓడించాాలని.. కుదిరితే పులివెందులలో జగనన్నను కూడా ఓడించాలన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాకూడదన్నారు. షర్మిలను ఎంపీ అభ్యర్థిగా పెట్టాలని ఆనాడు వివేకా అనుకున్నారని.. షర్మిలకు మద్దతు ఇవ్వకుండా ఉండేందుకు వివేకాను చంపేశారా అని ప్రశ్నించారు. వివేకాను ఎవరు చంపారో కడపలో ప్రజలందరికి తెలుసని జగన్ అన్నారని.. అవినాష్‌ను అరెస్ట్ చేస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని భయమా అన్నారు.


జగన్ ఎందుకు భయపడుతున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలని.. తనతో నేరుగా మాట్లాడాలంటే వైఎస్ జగన్ ఛానల్‌కే వస్తా.. ధైర్యంగా మాట్లాడదామన్నారు. తనకు ఎలాంటి అభ్యంతరం లేదని.. తాను ఆ ఛానల్‌కు వస్తానన్నారు. డిబేట్ చేస్తే వాస్తవాలన్నీ బయటకు వస్తాయన్నారు సునీత. వివేకా హత్య కేసులో ప్రజలకు వాస్తవాలన్నీ తెలియాలని.. ఈ కేసులో న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa