ఏపీలో వైసీపీ మృగాలు ఆడబిడ్డలపై అరాచకాలకు పాల్పడుతున్నాయని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తల్లిని, చెల్లిని పట్టించుకోని జగన్ను ఆదర్శంగా తీసుకొని మహిళలపై వైసీపీ గూండాలు పెట్రోల్ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఓటు హక్కుతో ప్రతి ఒక్క మహిళ జగన్కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసి, మళ్లీ ఇక ఎప్పటికి అధికారంలోకి రారని గుర్తించిన వైసీపీ గూండాలు సామాన్యులు, ప్రజలపై బరితెగించి దాడులకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. విశాఖ జిల్లా గాజువాకలో జులుమూరి రాధ అనే మహిళపై 65వ వార్డు వైసీపీ అధ్యక్షుడు లోకనాథం దాడి చేసి మంటల్లో నెట్టి హత్యాయత్నానికి పాల్పడ్డారని విరుచుకుపడ్డారు. వైసీపీ తప్పులను ఎత్తిచూపినందుకు, ఇంటి పట్టాకి లంచం ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించినందుకు దాడికి పాల్పడ్డారని అన్నారు. వేధింపులు తట్టుకోలేక గతంలో ఎన్నో సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం హేయనీయమన్నారు. తల్లిని, చెల్లిని పట్టించుకోని జగన్ లాంటి వ్యక్తి మళ్లీ ముఖ్యమంత్రి అయితే సాధారణ మహిళలను ఏం పట్టించుకుంటారు? అని ప్రశ్నించారు. జగన్ పాలనలో ఒక ఆడబిడ్డ పట్టపగలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు మృగాల్లా మహిళలపై దాడులకు పాల్పడుతున్నా చర్యలు శూన్యమన్నారు. ఇలాంటి పాలనను ప్రతి ఒక్క మహిళ తమ ఓటు హక్కు ద్వారా బుద్ధి చెప్పాలని అచ్చెన్నాయుడు అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa