అయోధ్యలో శ్రీరామనవమి ఉత్సవాల కోసం అన్ని ఏర్పాట్లు ఆలయ అధికారులు, ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం పూర్తి చేసింది. దేశవ్యాప్తంగా దాదాపు 40 లక్షల మంది రామనవమి సందర్భంగా అయోధ్య బాలరాముడిని దర్శించుకుంటారని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మూడు రోజుల పాటు అయోధ్య రాముడి దర్శన వేళలను పొడగించిన ఆలయ వర్గాలు.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు.. భక్తుల రద్దీ నేపథ్యంలో వీఐపీ దర్శనాలను రద్దు చేశారు. ఇక పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేసి.. అయోధ్యలో అడుగడుగునా నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే రామనవమి సందర్భంగా అయోధ్యకు వచ్చేవారి కోసం స్పెషల్ ప్రసాదం అందించనున్నారు.
రామ నవమి సందర్భంగా అయోధ్య రాముడికి ఏకంగా 1,11,111 కిలోల లడ్డూలను ప్రసాదంగా సమర్పించనున్నారు. దేవరహ హన్స్ బాబా ఈ లడ్డూలను పంపనున్నట్లు.. దేవరహ హన్స్ బాబా ట్రస్టీ అతుల్ కుమార్ సక్సేనా వెల్లడించారు. ఇప్పటికే ప్రతీ వారం లడ్డు ప్రసాదాలను కాశీ విశ్వనాథ ఆలయం, తిరుపతి బాలాజీ ఆలయాలకు పంపిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ జరిగిన ఈ జనవరి 22 వ తేదీన కూడా దేవ్రహ హన్స్ బాబా ఆశ్రమం నుంచి 40 వేల కిలోల లడ్డూలను నైవేద్యానికి పంపించినట్లు వెల్లడించారు.
దాదాపుగా 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో శ్రీరాముడి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే రామ్ లల్లా విగ్రహానికి ప్రత్యేక వస్త్రాలతో పాటు వేలాది క్వింటాళ్ల పూలతో అలంకరించనున్నారు. ఇప్పటికే అయోధ్య రామాలయాన్ని రంగురంగుల లైట్లతో అలంకరించారు. వాటికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం కన్నుల పండువగా ఉన్నాయి. ఇక అయోధ్య నగర వ్యాప్తంగా 100కి పైగా ఎల్ఈడీ స్క్రీన్లను సిద్ధం చేస్తున్నారు. రామ నవమికివచ్చే లక్షలాది మంది భక్తులకు బాల రాముడి దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు 600 మీటర్ల మేర జర్మన్ హ్యాంగర్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక భారీ ఎండల నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో కార్పెట్ ఏర్పాటు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa