శివాలయంలో ఇద్దరు అర్చకులపై ఓ వ్యక్తి దాడికి పాల్పడిన ఘటన ఇటీవల కాకినాడ జిల్లాలో చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ ఘటన మరువకముందే తాజాగా మరో పురోహితుడ్ని ఆకతాయిలు దారుణంగా అవమానించారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో ఏప్రిల్ 12న ఓ యువకుడికి వివాహం జరిగింది. గ్రామానికి చెందిన పురోహితుడు ఆచెల్ల సూర్యనారాయణమూర్తి శర్మ ఆ పెళ్లి జరిపించడానికి వెళ్లారు. ఈ క్రమంలో కొంతమంది ఆకతాయిలు ఆయనపై దుశ్చర్యకు పాల్పడ్డారు.
వధూవరులతో కార్యక్రమాలు జరిపిస్తున్న పురోహితుడు శర్మ తలపై తొలుత సంచి వేశారు. అంతటితో ఆగకుండా పసుపు, కుంకుమ, వాటర్ ప్యాకెట్లు చల్లారు. తర్వాత పాటు ఇతర సామాగ్రిని ఆయనపై విసిరారు. వారి చర్యలకు కలత చెందిన పురోహితుడు పెళ్లిని మధ్యలోనే ఆపేసి మండపం దిగి వెళ్లిపోయారు. ఈ తతంగాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ అయ్యింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై బ్రాహ్మణ, విశ్వహిందూ పరిషత్తు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తీవ్రంగా ఖండించిన సంఘాల నేతలు.. బాధితుడి ఇంటికి వెళ్లి పరామర్శించారు.
ఇంత ఘోరంగా అవమానించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దీనిపై బాధిత పురోహితుడు సూర్యనారాయణమూర్తి శర్మ మీడియాతో మాట్లాడుతూ.. ఆకతాయిలు తనపట్ల అసభ్యంగా ప్రవర్తించింది వాస్తవమే అన్నారు. వారి తీరుతో తాను చాలా ఆవేదనకు గురయ్యానని తెలిపారు. ఈ ఘటనపై విశ్వహిందూ పరిషత్ సంఘాలు స్పందించినట్టు చెప్పారు. సోమవారం చర్చించుకుని ఏంచేయాలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఇక, పోలీసులను సంప్రదించగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సమాధానం చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa