ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన.. ఆ నియోజకవర్గంలో టఫ్ ఫైట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 22, 2024, 07:48 PM

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ మరో జాబితా రిలీజ్ చేసింది. 38 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. గతంలో 114 శానససభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. తాజాగా అందులో పది స్థానాల్లో అభ్యర్థులను మార్చింది. మరో 28 స్థానాలకు అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. మొత్తంగా ఇప్పటి వరకూ ఏపీలో 142 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఏపీ కాంగ్రెస్ అభ్యర్థులను బరిలో నిలబెడుతోంది. అయితే తాజా లిస్టులో కనిపించిన ఓ పేరు.. ఆసక్తి రేపుతోంది. చీరాల నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ బరిలో ఉన్నారు.


మొన్నటి వరకూ వైసీపీలో కొనసాగిన ఆమంచి కృష్ణమోహన్ చీరాల అసెంబ్లీ టికెట్ ఆశించారు. అయితే ఆయనను కాదని.. టీడీపీలో గెలిచి వైసీపీకి మద్దతుగా నిలిచిన కరణం బలరాం తనయుడు కరణం వెంకటేష్‌కు వైసీపీ అధిష్టానం టికెట్ ఇచ్చింది. ఆమంచి కృష్ణ మోహన్‌కు పర్చూరు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. అయితే అధిష్టానం నిర్ణయం మీద అసంతృప్తితో వైసీపీకి గుడ్ బై చెప్పారు ఆమంచి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కాంగ్రెస్ నుంచి చీరాల ఎమ్మెల్యే రేసులో నిలిచారు.


ఆమంచి కృష్ణమోహన్ 2009లో చీరాల నుంచి కాంగ్రెస్ పార్టీ తరుఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో నవోదయం పార్టీ తరుఫున పోటీచేసి టీడీపీ అభ్యర్థి పోతుల సునీత మీద విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ.. ప్రభుత్పాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఆమంచి కూడా తన పార్టీని టీడీపీలో విలీనం చేసి సైకిలెక్కారు. ఇక 2019 ఎన్నికల నాటికి వైసీపీలో చేరారు. ఆమంచి కృష్ణమోహన్. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి చీరాల అభ్యర్థిగా పోటీ చేశారు.


అయితే 2019 ఎన్నికల్లో చీరాలలో టీడీపీ నుంచి పోటీచేసిన కరణం బలరామకృష్ణమూర్తి గెలుపొందారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాల్లో ఆయన కూడా వైసీపీలో చేరిపోయారు. దీంతో ఆమంచి, కరణం వర్గాలు రెండూ ఒకే పార్టీలో చేరిపోయాయి. అయితే రెండు పార్టీల మధ్య ఎప్పుడూ వర్గవిభేధాలు తలెత్తుతూనే ఉండేవి. దీంతో ఆమంచి కృష్ణమోహన్‌ను పర్చూరు ఇంఛార్జిగా వైఎస్ జగన్ నియమించారు. తాజాగా చీరాల టికెట్‍‌ను కరణం వెంకటేష్‌కు కేటాయించారు. దీంతో అసంతృప్తికి గురైన ఆమంచి వైసీపీని వీడి కాంగ్రెస్‌లో చేరి చీరాలలోనే పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చీరాల రాజకీయం ఆసక్తికరంగా మారింది. వైసీపీ నుంచి కరణం వెంకటేష్, టీడీపీ నుంచి మద్దులూరి మాలకొండయ్య యాదవ్, కాంగ్రెస్ నుంచి ఆమంచి కృష్ణమోహన్ పోటీ చేస్తుండటంతో త్రిముఖపోరు నెలకొంది. మరి చీరాల ఓటర్లు ఎవరిని ఆశీర్వదిస్తారనేదీ చూడాలి మరి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa