లోక్సభ ఎన్నికల వేళ.. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో మరోసారి మిలిటెంట్లు దాడులకు తెగబడ్డారు. కుకీ, మెయితీ తెగల మధ్య గతేడాది తలెత్తిన హింసాత్మక సంఘటనల్లో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక దాదాపు లక్ష మంది వరకు నిరాశ్రయులయ్యారు. కొన్ని నెలలపాటు ఆ రాష్ట్రంలో తీవ్ర హింసాత్మక ఘటనలు చోటు చేసుకోగా.. ఆ తర్వాత తగ్గిపోయాయి. అనంతరం అడపాదడపా అక్కడ మిలిటెంట్లు, భద్రతా బలగాలకు మధ్య ఘర్షణ జరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే శుక్రవారం సార్వత్రిక ఎన్నికల రెండో విడత పోలింగ్ జరిగిన వేళ.. అర్ధరాత్రి పూట కుకీ తెగకు చెందిన మిలిటెంట్లు తమ ఆయుధాలకు పని చెప్పారు. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం కురిపించారు.
లోక్సభ ఎన్నికల రెండో దశలో భాగంగా అవుటర్ మణిపూర్ స్థానానికి శుక్రవారం పోలింగ్ జరిగింది. బిష్ణుపూర్ జిల్లాలోని నరన్సైనా ప్రాంతంలో ఎలక్షన్ డ్యూటీ చేసిన సీఆర్పీఎఫ్ సిబ్బంది అక్కడే ఉన్న ఇండియా రిజర్వ్ బెటాలియన్ క్యాంప్ వద్ద రాత్రి పూట బస చేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ క్యాంప్పైకి కుకీ మిలిటెంట్లు దాడికి తెగబడ్డారు. సీఆర్పీఎఫ్ సిబ్బందే లక్ష్యంగా కొండల నుంచి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అర్ధరాత్రి 12.30 గంటలకు ప్రారంభమైన కాల్పుల వర్షం దాదాపు తెల్లవారుజామున 2.30 గంటల వరకు సాగినట్లు అధికారులు తెలిపారు. సీఆర్పీఎఫ్ క్యాంప్పైకి కుకీ మిలిటెంట్లు బాంబులు కూడా విసిరినట్లు పేర్కొన్నారు. సీఆర్పీఎఫ్ క్యాంపు పైకి కుకీ మిలిటెంట్లు పంపీ గన్తో బుల్లెట్ల వర్షం కురిపించినట్లు భద్రతా బలగాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అయితే మిలిటెంట్ల కాల్పులతో వెంటనే సీఆర్పీఎఫ్ బలగాలు అలర్ట్ అయ్యాయి. వెంటనే స్పందించి.. మిలిటెంట్లపై ఎదురుకాల్పులు జరిపారు. చివరికి మిలిటెంట్లు అక్కడి నుంచి పరారీ కావడంతో కాల్పులు ఆగిపోయాయి.
ఈ ఘటనలో ఇద్దరు సీఆర్పీఎఫ్ సైనికులు అమరులు అయ్యారు. సీఆర్పీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎన్. సర్కార్.. హెడ్ కానిస్టేబుల్ అరూప్ సైనీ ప్రాణాలు కోల్పోయినట్లు మణిపూర్ పోలీసులు తెలిపారు. వీరితోపాటు మరో ఇద్దరు జవాన్లు జాదవ్ దాస్, అఫ్తాబ్ దాస్ కూడా గాయపడినట్లు వెల్లడించారు. ప్రస్తుతం అటవీ ప్రాంతంలోకి పారిపోయిన కుకీ మిలిటెంట్ల కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa