ధనవంతులకు కొమ్ము కాసే వ్యక్తి చంద్రబాబు అంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. ప్రచార పర్వంలో భాగంగా గార మండలం, సతివాడ నిజామాబాద్,తూలుగు, అంపొలు..గ్రామాలలో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు రోడ్ షో నిర్వహించారు. స్థానికులతో మమేకం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ధనవంతులకు కొమ్ముకాసే వ్యక్తి. ఆయన్ను నమ్మవద్దు. ఆయన కానీ ఆయనకు బాకాలు ఊదే ఈనాడు పేపరు కానీ ధనవంతుల పక్షాన నిలిచేవే కానీ పేదల బాధలను పట్టించుకునే నైజం వాళ్లకు లేదు. అందుకు ఉదాహరణలు ఎన్నో. అందుకే పేదల పక్షాన నిలిచే జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి వాళ్లంతా అసత్య ప్రచారాలు చేస్తుంటారు. ఐదేళ్ల పాటూ మిమ్మల్ని పాలించాం. మళ్లీ అధికారం ఇవ్వమని అడుగుతు న్నాం. మీ ముందు రెండు రాజకీయ పార్టీలు ఉన్నాయి. 2014 నుంచి 2019 వరకూ పాలించిన పార్టీ ఒకటి,2019 నుంచి 2024 వరకూ పాలించిన పార్టీ ఇంకొకటి. ఈ రెండు పరిపాలనలలో వ్యత్యాసాలు మీరు చూశారు. రెండూ రాష్ట్ర విభజన జరిగిన తరువాతే ఈ పదేళ్ల కాల వ్యవధిలో ఇక్కడ పాలన సాగించాయి. ఒకరు పేదల ప్రజలకూ,గ్రామీణ రైతాంగానికీ,డ్వాక్రా మహిళలకూ వ్యతిరేకం గా పాలన సాగించారు. పని చేశారు. ఇంకొకరు గ్రామీణ ప్రజల కన్నీరు తుడిచింది. ఆకలి తీర్చిది. రైతాంగానికి సాయం చేసింది. వీటికి ఎవరో సాక్ష్యం కాదు కదా.. ఒక్కసారి ఈ ఐదేళ్లలో మీ అకౌంట్లలో పడిన డబ్బు చూడండి. ఎలా వస్తుంది అది. ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే వస్తుంది. ఎందుకింత మీమాంస మనకి ? ఎవరో తెలివి తక్కువ పిల్లలు బంపర్ సిక్స్, సూపర్ సిక్స్ అని రంగు రంగుల కాగితాలు పట్టుకుని వచ్చినంత మాత్రాన మీరు నమ్మాల్సిన పని లేదు. అసలు ఆ మ్యానిఫెస్టోకు విలువ లేదు. సాధ్యం కాని హామీలతో ఉమ్మడి మ్యానిఫెస్టో అని చంద్రబాబు,పవన్ ప్రజలను మభ్య పెడుతున్నారు. అసలు ఆ మ్యానిఫెస్టోను ముట్టుకునేందుకే కూటమిలో భాగస్వామి అయిన బీజేపీ నాయకులు ఇష్టపడడం లేదు. మాకెందుకు ఆ పాపం అని పక్కకు తప్పుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా 75 వేల కోట్ల రూపాయలు సంక్షేమానికి ఖర్చు అవుతుంది. ప్రభుత్వ వార్షిక ఆదాయమే 90 వేల కోట్ల రూపాయలు. కానీ మాట ఇచ్చాం కదా అని మాట తప్పకుండా మీకు సంక్షేమ పథకాలను అందించే పని చేస్తున్నాం. ఎన్నికలు వచ్చాయని అతడు ఇంతవరకూ వ్యతిరేకించిన వాడు ఇలాంటి గ్రామీణ ప్రాంతంలో బీదలకు అందించడమే తప్పు అని చెప్పిన వ్యక్తి, ఇప్పుడు అమాంతంగా రెండు మూడు రెట్లు ఎక్కువ ఇస్తానని అంటున్నాడు. అసలు చంద్రబాబుకు ఎంత మంది మహిళలు ఉన్నారో లెక్క ఉందా ? అంత బడ్జెట్ లేదన్న సంగతి ఆయనకు తెలుసా అని అడుగుతున్నాను. ఎన్నికలప్పుడు అమలు కాని మాటలు చెప్పవచ్చు. తరువాత ఆ కాగితాన్ని (మ్యానిఫెస్టోను) చెత్తబుట్టలో వేయవచ్చు అని అనుకుంటారు. అలానే రైతులను మోసగించారు. మహిళలను మోసగించారు. ఇరవై ఆరు కోట్ల రూపాయలు డ్వాక్రారుణాలు చెల్లించాం. ఐదేళ్లూ రైతు భరోసా ఇచ్చాం. అలానే ఈ ప్రాంతానికి వంశధార తెచ్చాం. అలానే గొట్టా దగ్గర ఎత్తిపోతల పథకం పూర్తయితే సతివాడకు మండు వేసవిలో వంశధార అందిస్తాం. ఇవాళ మీ కళ్లెదురుగా అభివృద్ధి ఉంది. నాడు - నేడులో భాగంగా బడుల అభివృద్ధి, విలేజ్ హెల్త్ క్లినిక్ లు, అలానే ఆర్బీకేలు ఏర్పాటు చేశాం. అలానే పాలన వికేంద్రీకరణలో భాగంగా సచివాలయాలను ఏర్పాటు చేసి సత్ఫలితాలు అందుకున్నాం. మీ ప్రయోజనాలకు పాటుపడిన ప్రభుత్వాన్ని పడగొట్టాలని చంద్రబాబు అంటుంటే మీరు ఇలాంటి ప్ఱభుత్వాన్ని వదులుకుంటారా చెప్పండి ? ఇలాంటి బాధ్యత లేని వారిని నిలువరించాలి. సతివాడ గ్రామంతో ఎంతో అనుబంధం ఉంది. ఈ గ్రామ అవసరాలను తీర్చడంతో సాయశక్తులా కృషి చేస్తున్నాను. ఈ ఎన్నికల్లో నన్ను గెలిపించండి. మళ్లీ పథకాలు అందిస్తున్నాం. 45 ఏళ్లు నిండిన మహిళలకు చేయూత పథకం కింద 75 వేలు వచ్చే ఐదేళ్లలో వేస్తాం. అలానే అరవై ఏళ్లు దాటిన మహిళలకు,వృద్ధులకూ నెలకు మూడు వేల పింఛను అందిస్తాం. తరువాత పింఛను క్రమక్రమంగా పెంచుతాం. వచ్చే ఐదేళ్లలో చివరి రెండేళ్లూ అంటే 2028 ఏడాదికి 3250 రూపాయలు,2029 నాటికి 3500 రూపాయలు చొప్పున పింఛను అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. సాధ్యం అయిన విధంగానే మా హామీలు ఉంటాయి తప్ప వాస్తవ దూరంగా మాటలు ఉండవు. మీరంతా నన్ను గెలిపించాలని కోరుతున్నాను. అలానే పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న పేరాడ తిలక్ ను గెలిపించాలని విన్నవిస్తున్నాను. ఫ్యాను..గుర్తుకు ఓటు వేసి మా ఇరువురుకీ అఖండ మెజార్టీ ఇవ్వాలని మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. నన్ను ఆదరించిన గ్రామస్థులకు కృతజ్ఞతలు అని మంత్రి ధర్మాన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa