ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజీనామా చేయకపోవడానికి కారణం అదే.. కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు

national |  Suryaa Desk  | Published : Sun, May 12, 2024, 07:51 PM

మద్యం పాలసీ కేసులో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు సర్వోన్నత న్యాయస్థానం.. శుక్రవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. దీంతో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత శనివారం ఆయన తొలిసారి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకపోవడానికి గల కారణాన్ని వివరించారు. మనీల్యాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.


  తనకు ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదని, తప్పుడు కేసుతో కుట్రపూరితంగా తనను పదవి నుంచి దింపేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ‘ముఖ్యమంత్రి పదవి నాకు ముఖ్యం కానీ.. బూటకపు కేసుతో అధికారం పీఠం నుంచి దింపేందుకు కుట్రలు చేసినందుకే రాజీనామా చేయలేదు’ అని కేజ్రీవాల్ ఉద్ఘాటించారు. ‘ఒకవేళ అవినీతిపై పోరాటం గురించి ప్రధాన మంత్రి నేర్చుకోవాలంటే అరవింద్ కేజ్రీవాల్ నుంచి నేర్చుకోవాలి. అవినీతిపరులైన మా మంత్రులను కూడా జైలుకు పంపాం’ అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.


నలుగురు అగ్రనేతలను జైలుకు పంపడం ద్వారా ఆప్‌ని అణిచివేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఏ అవకాశాన్ని వదిలిపెట్టలేదని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఆప్ నేతల సత్యేందర్ జైన్, మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్ సహా కేజ్రీవాల్‌ అరెస్టయి జైలుకు వెళ్లారు. ‘వాళ్లు తమ పార్టీని అణచివేయాలని అనుకుంటున్నారు.. కానీ ఆప్ పార్టీ కాదు ఓ ఆలోచన.. ఎంత అణచివేయాలని ప్రయత్నిస్తే అంత బలంగా ఎదుగుతాం’ అని కేజ్రీవాల్ అన్నారు. తాను లోక్‌సభ ఎన్నికల సమయంలోనే జైలు నుంచి విడుదలవుతానని ఆప్ మద్దతుదారులు ఎవరూ ఊహించలేదన్నారు. కానీ వారి ప్రార్థనలు, హనుమంతుడి ఆశీస్సులతో బయటకు వచ్చానని అన్నారు.


దక్షిణ ఢిల్లీలో రోడ్ షో నిర్వహించిన కేజ్రీవాల్.. జైల్లో ఉన్న 50 రోజుల తాను ఢిల్లీ ప్రజలను ఎంతగానో మిస్సయ్యానని అన్నారు. బెయిల్‌పై విడుదలైన నేరుగా ప్రజల వద్దకు వచ్చానని, తనకోసం ప్రార్ధించిన కోట్లాది మందికి ధన్యవాదాలు చెబుతున్నానని వ్యాఖ్యానించారు. జైల్లో ఉన్నా ఢిల్లీ ప్రజల కోసమే తన ఆలోచన అంతా అని అన్నారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే.. ప్రతిపక్ష నాయకులందర్నీ జైలుకు పంపుతారని సంచలన వ్యాఖ్యలు చేశారుే. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఉద్ధవ్ ఠాక్రే, తేజస్వీ యాదవ్‌ల వంటి వారికి జైలు తప్పదని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa