నువ్వు ఎక్కాల్సిన రైలు.. జీవితకాలం లేటు అన్నాడో సినీకవి. భారతీయ రైళ్ల గురించి వ్యంగ్యంగా అన్నప్పటికీ.. పాపం విశాఖవాసుల పరిస్థితి మాత్రం అలాగే ఉంది. ఏపీ ఎన్నికల్లో ఓటు వేద్దామని వారంతా సొంతూళ్లకు బయల్దేరారు. ఆఖరి నిమిషంలో రిజర్వేషన్లు చేసుకుంటే సీట్లు దొరకవేమోననే భయంతో.. చాలా ముందుగానే రిజర్వేషన్లు కూడా చేసుకున్నారు. ఇక నిశ్చింతగా ఓటేయవచ్చని అనుకున్నారు. కానీ..సీన్ రివర్సైంది. పోలింగ్ రోజు రైలు ఆలస్యం కావటంతో ఇప్పుడు ఓటుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది.
విశాఖపట్నానికి వెళ్లాల్సిన ప్రయాణికులు చాలామంది.. నాదేండ్- విశాఖఫట్నం ఎక్స్ప్రెస్లో టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు మే 12వ తేదీ రాత్రి 9గంటల 30 నిమిషాలకు రావాల్సిన నాందేడ్ - విశాఖ ఎక్స్ప్రెస్.. ఆలస్యమైంది. అయితే ఒకటీ రెండు గంటలు కాదు.. ఏకంగా 5 గంటలు ఆలస్యమైంది.12వ తేదీ రాత్రి 9:30 నిమిషాలకు సికింద్రాబాద్ రావాల్సిన రైలు.. పోలింగ్ తేదీ అయిన మే 13వ తేదీ తెల్లవారజామున నాలుగు గంటలకు స్టేషన్కు చేరుకుంది. రైలు కాస్త ఆలస్యమైనా సాయంత్రానికల్లా విశాఖ చేరుకుంటామని.. ఆరు గంటల వరకూ పోలింగ్ గడువు ఉండటంతో ఓటు వేస్తామనే ధీమాతో ప్రయాణికులు రైలు ఎక్కారు.
అయితే అక్కడి నుంచి నాందేడ్ ఎక్స్ప్రెస్ పయనం.. మరింత నెమ్మదైంది. ప్రస్తుతం నాందేడ్- విశాఖ రైలు 9 గంటలు ఆలస్యంగా నడుస్తుండగా.. విశాఖ చేరుకునేసరికి సాయంత్రం ఆరు దాటిపోయే పరిస్థితి ఉంది. దీంతో రైళ్లోని ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లకు ఓసారి ఎన్నికలు జరుగుతాయని.. రైల్వే తీరుతో తాము పోలింగ్కు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైళ్లో ఎక్కువ మంది తాడేపల్లి, రాజమండ్రి, విశాఖపట్నం వరకు వెళ్లే ప్రయాణికులు ఉన్నారు. వీరంతా తమ పరిస్థితిని ఎన్నికల సంఘానికి సైతం తెలియజేశారు. ఓటు వేసేందుకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. తాము ఓటు వేసేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. మరి వీరి వినతిపై ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa