మహ్మధ్ ముయిజ్జ మాల్దీవుల అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత్ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాడు. దీంతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో ప్రతిష్ఠంభన ఏర్పడింది. ఈ క్రమంలో ఆ దేశానికి మరోసారి భారత్ చేయూత అందించడం గమనార్హం. రూ.417.45 కోట్ల రుణం గడువును ఏడాది పాటు పొడిగించింది. దీంతో వడ్డీలేకుండా ఈ రుణాన్ని మాల్దీవులు వినియోగించుకునే వెసులుబాటు కలిగింది. ఇటీవల భారత్లో పర్యటించిన మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్.. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమకు ఆర్ధిక సహకారం అందజేయాలని కోరారు. దీంతో మాల్దీవులు చేసిన విజ్ఞప్తికి భారత్ సానుకూలంగా స్పందించింది.
భారత్ అందించిన సాయంపై స్పందించిన మూసా జమీర్.. విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆ ద్వీప దేశానికి 50 మిలియన్ డాలర్ల (రూ.417.45 కోట్లు) కేటాయించినందుకు కేంద్ర ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. ఇది మాల్దీవులు, భారత్ మధ్య చిరకాల స్నేహాన్ని సూచించే సద్భావనకు నిజమైన సంకేతమని ఆయన కొనియాడారు.
మాలేలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా రుణాన్ని వాడుకోడానికి ఏడాది గడువును పొడిగించందని మాల్దీవుల విదేశాంగ కార్యాలయం తెలిపింది. ‘బడ్జెట్ కేటాయింపుల మద్దతు రూపంలో మాల్దీవులకు భారత ప్రభుత్వం అందిస్తున్న ఉదారమైన సాయాన్ని ఎంతో అభినందిస్తున్నాం" అని పేర్కొంది. ‘భారత్ సహాయంతో పెద్ద సంఖ్యలో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులు, సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు సాగుతున్నాయి.., ఇందులో గ్రాంట్ సహాయంగా చెప్పుకోదగిన భాగం ఉంది. తమ ప్రజల పరస్పర ప్రయోజనం, శ్రేయస్సు కోసం భాగస్వామ్య సహకారం కొనసాగించడానికి మాల్దీవుల ప్రభుత్వం ఎదురుచూస్తోంది’ అని ముయిజ్జు ప్రభుత్వం ప్రకటన చేసింది.
మాల్దీవులతో సంబంధాలు ఇటీవల కాలంలో క్షీణించాయి. చైనా అనుకూలంగా వ్యవహరించే ముయిజ్జు గతేడాది జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇరు దేశాల సంబంధాలు దెబ్బతిన్నాయి. అక్కడ నుంచి భారత వ్యూహాత్మక బలగాలను ముయిజ్జు ఒత్తిడితో భారత్ ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. అయినా ఆ దేశానికి భారత్ అండగా ఉంటోంది. గతంలో కరోనా, ఇతర సంక్షోభ సమయాల్లోనూ ఉదారంగా సాయం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa