తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది.. గత వారం రోజులుగా కొండపై భక్తులు దర్శనానికి బారులు తీరారు. ఈ క్రమంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.. జూన్ 30 వరకు శుక్ర, శని ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. వేసవి సెలవులతో పాటుగా ఎన్నికలు పూర్తికావడం, విద్యార్థుల పరీక్షల ఫలితాలు విడుదల కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా వీకెండ్ మూడు రోజులు (శుక్ర, శని, ఆదివారాలు) సామాన్య భక్తుల రద్దీ కారణంగా.. దర్శనానికి సుమారు 30-40 గంటల సమయం వరకు క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందన్నారు.
సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించేందుకు వీలుగా.. జూన్ 30వ తేదీ వరకు శుక్ర శని, ఆదివారాలలో బ్రేక్ దర్శనం రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. వీఐపీ బ్రేక్ దర్శనానికి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని.. భక్తులు ఈ మార్పును గమనించి టీటీడీకి సహకరించాలని టీటీడీ కోరుతోంది. భక్తులు కూడా రద్దీని గమనించి తిరుమల ప్రయాణం ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
ఇవాళ కూడా తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. కొండపై వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయి.. ఏకంగా రింగు రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు భక్తులు క్యూ కట్టి ఉన్నారు. దాదాపు 3 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లలో నిలబడి ఉన్నారు. వీరికి శ్రీవారి దర్శనానికి 20 గంటలకుపైగా సమయం పడుతోందని టీటీడీ చెబుతోంది. టీటీడీ రద్దీని గమనిస్తూ.. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు అందిస్తున్నారు. ఈ మూడు రోజులు రద్దీ కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.
ఆనాటి సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడుతూ.. మహిళ సాధికారతను తీసుకువచ్చి.. తిరుమలలో అన్నప్రసాద వితరణకు మార్గదర్శకత్వం వహించిన గొప్ప వ్యక్తి మాతృశ్రీ తారిగొండ వెంగమాంబ అన్నారు విశాఖ శారద పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిజీ. టీటీడీ తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెంగమాంబ 294వ జయంతి ఉత్సవాల సందర్భంగా స్వామీజీ ప్రసంగించారు. హిందూ సనాతన ధర్మం యొక్క సారాంశాన్ని ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి వివిధ సోషల్ మీడియాల ద్వారా ప్రతి ఒక్కరూ విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.
“భారతదేశంలోని పురాతన దేవాలయాలు విజ్ఞానం, నీతి, సామాజిక సేవ మరియు ఆదాయ కేంద్రాలని తెలిపారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రపంచంలో హిందూ ధర్మాన్ని విస్తృతంగా ప్రచారం చేసే బాధ్యతను ప్రతి వ్యక్తి స్వీకరించాలని, భావి తరాలకు మన వేద ధర్మాన్ని అందించాలని పిలుపునిచ్చారు” స్వామీజి. టీటీడీ శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్, ధార్మిక పుస్తకాలను ప్రచురించడం ద్వారా మాత్రమే కాకుండా, సోషల్ మీడియా ద్వారా కూడా హిందూ ధర్మ ప్రచారాన్ని విస్కృతంగా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నేడు ప్రతి ఒక్కరికి ట్విట్టర్, వాట్సాప్, ఫేస్బుక్ ఖాతాలు ఉన్నాయి. కనుక మన సనాతన ధార్మిక అంశాలను సాంఘిక మాధ్యమాల ద్వారా మరింత విస్తారంగా ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa