చక్కని శరీర సౌష్టవం, నడకలో రాజసంతో ఒంగోలు జాతి గిత్తలు, ఎద్దులు ఇట్టే ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇక తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశవ్యాప్తంగా వీటికి యమా క్రేజ్ ఉంది. పశువుల జాతిలో వీటికంటూ ఓ స్పెషాలిటీ ఉంది. ఒంగోలు జాతి ఎద్దులు, గిత్తల గురించి ఇప్పుడీ ఉపోద్ఘాతం ఎందుకంటే.. కర్నూలు జిల్లాలో ఒంగోలు జాతికి చెందిన ఎద్దు రికార్డు స్థాయిలో ధర పలికింది. దెబ్బకు దాని యజమాని లక్షాధికారిగా మారిపోయాడు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం చిన్న నెలటూరు గ్రామంలో ఈ ఘటన జరిగింది.
కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని చిన్న నెలటూరు గ్రామానికి చెందిన అమరేశ్వరప్ప అనే రైతు ఒంగోలు జాతి ఎద్దులను పెంచి పోషిస్తున్నారు. అలాగే రాతిదూలం లాగుడు పోటీల కోసం వాటికి శిక్షణ కూడా ఇస్తున్నారు. అయితే అమరేశ్వరప్ప వద్దనున్న ఒంగోలు జాతికి చెందిన ఎద్దును అనంతపురం జిల్లాకు చెందిన ఓ రైతు రికార్డు ధర పెట్టి కొనుగోలు చేశారు. అనంతపురం జిల్లా ఏ.నారాయణపురం గ్రామానికి చెందిన షేక్ నాజీర్ బాషా అనే రైతు ఈ ఎద్దును రూ.15 లక్షలకు కొనుగోలు చేశాడు. అయితే ఈ ఎద్దు ఇప్పటి వరకూ 15కు పైగా రాతిదూలం పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకున్నట్లు అమరేశ్వరప్ప చెప్తున్నారు.
అయితే ఒంగోలు జాతి ఎద్దులు, గిత్తలు ఈ రేంజులో ధర పలకడానికి అనేక కారణాలు ఉన్నాయి. బండలాగుడు పోటీలు, అందాల పోటీలలో ఒంగోలు జాతి పశువులు స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుంటాయి. ఈ జాతి పశువులు మంచి కండపుష్టిని కలిగి ఉంటాయి. అలాగే వీటిలో రోగనిరోధకశక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. పాల ఉత్పత్తి, బరువులు లాగడంలో ఒంగోలు జాతి పశువులు వాటికవే సాటి అని రైతులు చెప్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఒంగోలు జాతి పశువులకు ఈ రేంజులో డిమాండ్ ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa