ఓ అరుదైన వ్యాధి ఏపీలో కనిపించడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఎక్కడో ఉత్తరాది రాష్ట్రం పంజాబ్లో అరుదుగా కనిపించే వ్యాధి.. ఇప్పుడు పల్నాడు జిల్లాలో బయటపడటం ఆ ప్రాంతవాసులను భయపెడుతోంది. మనదేశంలో పంజాబ్ రాష్ట్రంలో మాత్రమే అప్పుడప్పుడూ కనిపించే సికిల్ హిమోగ్లోబిన్ డి- పంజాబ్ అనే వ్యాధి ఇప్పుడు పల్నాడు జిల్లాలో వెలుగుచూసింది. పల్నాడు జిల్లాకు చెందిన ఇద్దరు చిన్నారులలో ఈ అరుదైన వ్యాధిని గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పలపాడు శివారు ప్రాంతమైన శ్రీరాంపురం తండాకు చెందిన ఇద్దరు పిల్లల్లో సికిల్ హిమోగ్లోబిన్ డి- పంజాబ్ అనే వ్యాధిని గుర్తించినట్లు గుంటూరు సర్వజనాసుపత్రి సూపరింటెండెంట్ కిరణ్కుమార్ తెలిపారు.
సోమవారం విలేకర్ల సమావేశం నిర్వహించిన జీజీహెచ్ వైద్యులు .. ఈ వ్యాధి గురించి వివరాలు వెల్లడించారు. శ్రీరాంపురం తండాకు చెందిన ఇద్దరు చిన్నారులు రక్తహీనతతో బాధపడుతూ ఇటీవల ఆస్పత్రికి వచ్చారని.. పెథాలజీ విభాగం డాక్టర్లు బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ఈ విషయం బయటపడిందని జీజీహెచ్ సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ తెలిపారు. రక్తపరీక్షల్లో వారికి సికిల్ హీమోగ్లోబిన్ డి- పంజాబ్ అనే అరుదైన వ్యాధి సోకినట్లు గుర్తించామని చెప్పారు. ఇది చాలా అరుదైన వ్యాధిగా చెప్పిన కిరణ్ కుమార్.. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కటే సరైన చికిత్సని చెప్పారు. అయితే ప్రస్తుతం జీజీహెచ్లో అలాంటి విధానం అందుబాటులో లేదని వివరించారు. ఎర్రరక్తకణాలను ఎక్కించడం ద్వారా తాత్కాళికంగా సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు.
ఇద్దరు చిన్నారుల్లో ఈ అరుదైన వ్యాధి గుర్తించిన నేపథ్యంలో.. శ్రీరాంపురం తండా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న చిన్నారులు అందరికీ రక్తపరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని జీజీహెచ్ పెథాలజీ డాక్టర్లు తెలిపారు. బ్లడ్ టెస్టుల ద్వారానే ఇంకా ఎంతమందిలో ఇలాంటి సమస్య ఉందో తెలుస్తుందని చెప్పారు. ఇక ఈ వ్యాధిసోకిన వారిలో ఎర్రరక్తకణాల సంఖ్య తగ్గిపోతుందని.. తాత్కాలికంగా వారికి ఎర్రరక్తకణాలను ఎక్కిస్తే ఉపశమనం ఉంటుందని వివరించారు. పూర్తిగా నయం కావాలంటే మాత్రం బ్యోన్మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కటే పరిష్కారమని చెప్తున్నారు.
అసలు ఏంటీ సికిల్ హిమోగ్లోబిన్ డి- పంజాబ్?
ఇదో రకం జన్యుపరమైన వ్యాధి. తల్లిదండ్రుల్లో ఈ వ్యాధి ఉంటే పిల్లలకు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. ఈ వ్యాధి సోకిన వారి రక్తంలో హిమోగ్లోబిన్ 5% కన్నా తక్కువగా ఉంటుంది. ఎర్రరక్తకణాల సంఖ్య తగ్గుతూ ఉంటుంది. దీంతో తరుచుగా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. త్వరగా అలిసిపోతుంటారు. బోన్మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా మాత్రమే ఈ వ్యాధిని నయం చేయవచ్చు. ఈ వ్యాధి పాకిస్థాన్, ఇండియాలోని పంజాబ్ ప్రాంతం, ఉత్తర చైనా, ఉత్తర అమెరికా, లాస్ ఏంజెల్స్ ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటుంది. మనదేశంలో పంజాబ్ ప్రాంతంలో అప్పుడప్పుడూ ఇలాంటి కేసులు వెలుగుచూస్తూ ఉంటాయి. దీంతో దీనిని సికిల్ హిమోగ్లోబిన్ డి- పంజాబ్ అని పిలుస్తుంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa