ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు ఎంత చర్చనీయాంశం అయ్యాయో అందరికీ తెలిసింది. చివరకు కేంద్ర ఎన్నికల సంఘం సైతం.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఢిల్లీ పిలిపించి మరీ వ్యక్తిగతంగా వివరణ తీసుకుందంటే ఏపీ ఎన్నికల్లో ఏ మేరకు హింసాత్మక ఘటనలు జరిగాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో పెట్రోల్ బాంబులతో పరస్పరం దాడులు చేసుకోవడం.. పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను పగలగొట్డడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఏపీ ఎన్నికల్లో హింసపై స్పందించారు. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన రేవంత్ రెడ్డి.. ఏపీ ఎన్నికలపైనా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో ఎన్నికల సమయంలో హింస చెలరేగిందన్న రేవంత్ రెడ్డి.. తెలంగాణలో ఒక్క ఘటన కూడా చోటుచేసుకోలేదన్నారు. ప్రత్యర్థులు సైతం విమర్శించడానికి వీలు లేని విధంగా ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో పూర్తిచేసినట్లు చెప్పుకొచ్చారు. ఏపీలో ఎన్నికల సమయంలో పోలీసులను బదిలీచేశారని.. కానీ తెలంగాణలో ఎలాంటి ట్రాన్స్ఫర్లు లేకుండా ఎన్నికల ప్రశాంతంగా జరిగాయని మీడియాతో చిట్ చాట్ సందర్భంగా రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అధికార దుర్వినియోగం చేశామని ఆరోపణలను సైతం ప్రతిపక్షాలు చేయలేదని గుర్తుచేశారు.
ఏపీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓటింగ్ రోజు, ఆ మరుసటిరోజు పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. పల్నాడు జిల్లా మాచర్ల, చంద్రగిరి, తాడిపత్రి ప్రాంతాల్లో టీడీపీ, వైసీపీ వర్గాలు పరస్పరం దాడులకు తెగబడ్డాయి. ఈ దాడులపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేసి విచారణ జరిపించారు. సిట్ ఇటీవలే తన నివేదికను సమర్పించగా.. వందలమందిపై కేసులు నమోదైనట్లు అందులో పేర్కొంది. అలాగే చంపాలనుకునే స్థాయి వరకూ ఎన్నికల్లో ఘర్షణలు జరిగినట్లు సిట్ తన నివేదికలో పేర్కొంది. సిట్ నివేదిక నేపథ్యంలో కౌంటింగ్ రోజు కోసం కేంద్ర ఎన్నికల సంఘం ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. అదనపు బలగాల మోహరింపుతో పాటుగా.. పోలీసులను జిల్లాల ప్రత్యేక అధికారులుగా నియమించి పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa