ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై వివాదం.. ఆ రూల్ మీద వైసీపీ అభ్యంతరం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 28, 2024, 08:40 PM

ఏపీలో కౌంటింగ్ రోజు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. పోలింగ్ ముగిసిన తర్వాత కొద్ది రోజులుగా సైలెంట్‌గా ఉన్న నేతలు.. ఇప్పుడు మళ్లీ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై కొత్త వివాదం చెలరేగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు విషయంలో ఈసీ తాజాగా జారీచేసిన సడలింపును వైసీపీ తప్పుబడుతోంది. ఈ క్రమంలోనే.. వైసీపీ నేతలు పేర్నినాని, మేరుగ నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి ఏపీ అదనపు సీఈవోను కలిసి ఫిర్యాదు చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై అన్నిరాష్ట్రాలకు గతంలోనే ఈసీ నిబంధనలు పంపిందని పేర్నినాని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ కవర్ల దగ్గర నుంచి, 13ఏ, 13బీ నిబంధనలు అన్నీ ముందే చెప్పారని.. కానీ ఇప్పుడు మళ్లీ సడలింపులు ఏమిటని పేర్ని్నాని అభ్యంతరం తెలిపారు.


ఏపీ ఎన్నికలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్లపై రిటర్నింగ్ అధికారి సీల్ లేకున్నా అనుమతించాలని ఈసీ తాజాగా సడలింపు ఇచ్చింది. ఆర్వో సీల్ లేదని తిరస్కరించవద్దని.. ఆర్వో సంతకం ఉన్న పోస్టల్ బ్యాలెట్లు కూడా చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. అలాగే ఫామ్ 13ఏ మీద ఆర్వో సంతకంతో పాటుగా అన్ని వివరాలు ఉండాలని.. ఆర్వో సంతకాన్ని బ్యాలెట్‌ను ధ్రువీకరించే రిజిస్టర్‌తో పోల్చుకోవాలని తెలిపింది. అలాగే ఫామ్ 13ఏలో ఓటరు, ఆర్వో సంతకం, బ్యాలెట్‌ సీరియల్‌ నంబర్‌ లేకుంటే వాటిని తిరస్కరించవచ్చని ఇటీవల మార్గదర్శకాలు జారీచేసింది. అయితే.. వైసీపీ నేతలు దీనిపై అభ్యంతరాలు తెలుపుతున్నారు.


పోస్టల్ బ్యాలెట్ మీద ఆర్వో సంతకం పెట్టి స్టాంప్ వేయాలని గతంలో చెప్పారన్న పేర్నినాని.. ఇప్పుడేమో స్టాంప్ వేయకపోయినా సరే ఆమోదించాలని అంటున్నారని అభ్యంతరం తెలిపారు. అలాగే పోస్టల్ బ్యాలెట్ కవర్లపై ఓటర్ సంతకం, గెజిటెడ్ ఆఫీసర్ సంతకం లేకపోయినా అనుమతించాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించిందన్న పేర్ని నాని.. ఏపీ సీఈవో మాత్రం స్పెసిమెన్ సంతకం చెక్ చేసుకోవాలని ఆదేశాలిచ్చారని అన్నారు.


దేశంలో ఎక్కడా లేనిది ఇక్కడే ఎందుకు తీసుకొచ్చారని పేర్ని నాని ప్రశ్నించారు. ఈ విషయంలో పునరాలోచన చేయాలని ఈసీని కోరినట్లు తెలిపారు. ఇలాంటి నిర్ణయాల కారణంగా కౌంటింగ్ రసాభాసగా మారుతుందని పేర్ని నాని చెప్పుకొచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం చెప్పని నియమావళిని ఏపీలో ఒక రాజకీయ పార్టీ అడిగిందని ఎందుకు ఇచ్చారని పేర్నినాని ప్రశ్నించారు. కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.


మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. మొత్తం5,39,189 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్ కాగా.. శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 38,865 ఓట్లు పోలయ్యాయి. భారీగా పోలైన పోస్టల్ బ్యాలెట్ల కారణంగా ఎన్నికల ఫలితాలు సైతం కాస్త ఆలస్యంగా వెల్లడయ్యే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa