బంగాళాఖాతంలో ఏర్పడిన రెమల్ తుఫాను ఆదివారం రాత్రి బెంగాల్, బంగ్లాదేశ్ వద్ద తీరం దాటినా ఇంకా విధ్వంసం కొనసాగుతూనే ఉంది. తుఫాను ప్రభావంతో బెంగాల్ సహా ఈశాన్య రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. తాజాగా, మిజోరాంలో భారీ వర్షాలకు రాళ్ల క్వారీ కూలి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఐజ్వాల్ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ ఒక చిన్నారి సహా పది మంది మృతిచెందినట్టు అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారని పేర్కొన్నారు.
ఆ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. కొండచరియలు విరిగిపడుతుంటంతో రెస్క్యూ సిబ్బందికి ప్రమాదం పొంచి ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శిథిలాల నుంచి ఓ చిన్నారిని బయటకు తీసి.. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. మృతులంతా క్వారీలో పనిచేస్తోన్న కార్మికులేనని, మట్టి పెల్లల కింద చిక్కుకున్నవారిని ప్రాణాలతో బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. మృతుల్లో ఆరుగురు మిజోరాం వాసులు కాగా.. మిగతావారిని స్థానికేతరులుగా గుర్తించారు. క్వారీ కూలిపోవడంతో సమీపంలోని పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి.
మరోవైపు, రెమల్ తుఫాను ప్రభావంతో మిజోరాంను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఐజ్వాల్ విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో కొండచరియలు విరిగిపడ్డి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. తల్వాంగ్ నది ఉద్ధృతంగా ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల ఇళ్లు కొట్టుకుపోయాయి. పశ్చిమ్ బెంగాల్ సమీపంలో తీవ్ర తుఫానుగా తీరం దాటిన రెమల్.. క్రమంగా సోమవారం సాయంత్రానికి బలహీనపడి వాయుగుండంగా మారింది. ఇది ఈశాన్య దిశగా ప్రయాణించడంతో ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa