3 నెలలుగా లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశవ్యాప్తంగా పర్యటనలు చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఎన్నికల ప్రచార గడువు ముగియడంతో తమిళనాడులోని కన్యాకుమారిలో ఉన్న వివేకానంద రాక్ మెమోరియల్కు చేరుకున్నారు. 2 రోజుల పాటు అక్కడే ఉండనున్న ప్రధాని మోదీ.. 45 గంటల పాటు ధ్యానం చేస్తున్నారు. గురువారం సాయంత్రం 6.45 గంటలకు ధ్యానం ప్రారంభించిన మోదీ.. నిర్విరామంగా 45 గంటల పాటు కొనసాగించనున్నారుు. అయితే ఈ 2 రోజుల పాటు ప్రధాని మోదీ.. ఆహార పదార్థాలు ఏమీ ముట్టరని.. కేవలం ద్రవ పదార్థాలు మాత్రమే సేవిస్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఈ 45 గంటల ధ్యానంలో భాగంగా నరేంద్ర మోదీ.. కేవలం లిక్విడ్ డైట్ను మాత్రమే పాటించనున్నారు. కేవలం కొబ్బరి నీళ్లు, ద్రాక్ష రసం, ఇతర ద్రవ పదార్థాలను మాత్రమే తాగనున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక ధ్యానం సందర్భంగా నరేంద్ర మోదీ మౌనంగా ఉంటారని.. ఆ ధ్యాన మందిరం దాటి బయటకు అడుగు పెట్టరని వెల్లడించారు. ఈ క్రమంలోనే.. కాషాయ వస్త్రాలు ధరించి.. వివేకానంద రాక్ మెమోరియల్ పరిసర ప్రాంతాల్లో నరేంద్ర మోదీ తిరిగిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ప్రధాని మోదీ కన్యాకుమారిలో 2 రోజుల పాటు ఉండనున్న నేపథ్యంలో అక్కడ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అయితే ఎన్నికల ప్రచారం పూర్తి కాగానే ఆధ్యాత్మిక పర్యటనలు చేయడం నరేంద్ర మోదీకి అలవాటు. తొలిసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో 204 ఎన్నికల ప్రచారం పూర్తి కాగానే.. మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ మహరాజ్కు సంబంధించిన ప్రతాప్గఢ్కు వెళ్లారు. ఆ తర్వాత 2019 లోక్సభ ఎన్నికల ప్రచార గడువు పూర్తి కాగానే.. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం ఆ ఆలయానికి సమీపంలో ఉన్న ఓ గుహలోకి వెళ్లి అక్కడ ధ్యానం చేశారు.
ఇక ఈసారి తమిళనాడులోని కన్యాకుమారిలో ఉన్న వివేకానంద రాక్ మెమోరియల్ను ఎంచుకున్నారు. గురువారం సాయంత్రం ప్రత్యేక హెలికాప్టర్లో కన్యాకుమారి చేరుకున్న మోదీ.. ముందుగా శ్రీ భగవతీ అమ్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఓ పడవలో బయలుదేరి సముద్రంలో ఉన్న శిలాస్మారకాన్ని చేరుకున్నారు. అక్కడ రామకృష్ణ పరమహంస, మాతా శారదాదేవి చిత్రపటాలకు పూలమాలలు వేశారు. అనంతరం వివేకానందుడి విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి ధ్యానం ప్రారంభించారు. ఇక జూన్ 1 వ తేదీన ధ్యానం పూర్తి కాగానే తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa