లోక్సభ ఎన్నికల చివరి దశ పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరుగనుంది.సుదీర్ఘంగా సాగుతున్న లోక్సభ ఎన్నికల్లో చివరిదైన ఏడో దశలో యూపీలో13 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగుతున్నాయి. అలాగే బీహార్లోని 8, పశ్చిమ బెంగాల్లో 9, జార్ఖండ్ 3, పంజాబ్ 13, హిమాచల్ ప్రదేశ్ 4, ఒడిశా 6 లోక్ సభ స్థానాలతో పాటు 42 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. అటు కేంద్ర పాలిత ప్రాంతం చండీఘర్కు ఈ విడతతోనే ఎన్నికల ప్రక్రియ పూర్తవుతోంది. పంజాబ్ నుంచి అత్యధికంగా 328 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా..ఆ తర్వాత యూపీలో 144 మంది , బిహార్లో 134 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక ప్రధాని మోదీ బరిలో నిలిచిన వారణాసి నియోజకవర్గానికి.. ఏడో దశలోనే ఓటింగ్ కొనసాగుతున్నది..
చివరి విడత ఎన్నికల బరిలో వారణాసిలో ప్రధాని మోదీపై.. కాంగ్రెస్ కీలక నేత అజయ్ రాయ్ పోటీ చేస్తున్నారు. దీంతో కాశీలో పోలింగ్ పై ఆసక్తి నెలకొంది. అలాగే బీజేపీకి చెందిన సినీ నటి కంగనా రనౌత్, కాంగ్రెస్ నుండి విక్రమాదిత్య సింగ్ మండి నుండి బరిలో ఉన్నారు. గోరఖ్పూర్ నుంచి బీజేపీ అభ్యర్థి రవికిషన్, సమాజ్వాదీ అభ్యర్థి కాజల్ నిషాద్ మధ్య పోటీ నెలకొంది. హమీర్పూర్ నుంచి బీజేపీ తరఫున అనురాగ్ ఠాకూర్, కాంగ్రెస్ తరఫున సత్యపాల్ సింగ్ బరిలో ఉన్నారు. బెంగాల్లోని డైమండ్ హార్బర్లో టీఎంసీ అభ్యర్థి అభిషేక్ బెనర్జీ, బీజేపీ అభ్యర్థి అభిజిత్ దాస్ మధ్య పోటీ నెలకొంది. బీహార్లోని పాటలీపుత్ర స్థానం నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.ఏడు రాష్టాల , ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 57 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతున్నది. ఇందులో 904 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా మొత్తం 10.06 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 5.24 కోట్ల మంది పురుషులు, 4.82 కోట్ల మంది మహిళలు, 3,574 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa