ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం కొలువుదీరనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎన్డీఏ సర్కారు ఏర్పాటు కానుంది. బుధవారం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం జరగనుండగా.. చంద్రబాబుతో పాటుగా మరికొందరు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయవచ్చని తెలిసింది. పది మంది వరకూ మంత్రులు ప్రమాణం చేయవచ్చని సమచారం. ఇక ఇప్పటికే మంత్రి పదవుల కోసం ఆశావహులు అందరూ తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. మంత్రివర్గంలో కూటమి పార్టీలైన జనసేన, బీజేపీలకు సైతం స్థానం కల్పించనున్నారు. ముఖ్యమంత్రి కాకుండా ఏపీలో 25 మందిని మంత్రులుగా చేసేందుకు అవకాశం ఉంది. 25లో జనసేన, బీజేపీలకు కలిపి ఐదు మంత్రి పదవులు దక్కవచ్చని సమాచారం. ఇక మంత్రి పదవులను పక్కనబెడితే ఏపీ అసెంబ్లీ స్పీకర్గా ఎవరు ఉంటారనేదీ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
మంత్రివర్గం ఏర్పాటైన తర్వాత జూన్ 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమావేశాల్లోనే ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం స్పీకర్ను ఎన్నుకోనున్నారు. అయితే ఏపీ శాసనసభ స్పీకర్ కోసం ఇప్పుడు పలువురు పేర్లు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీకి చెందిన ముగ్గురు సీనియర్ నేతల పేర్లు ఏపీ శాసనసభ స్పీకర్ పదవి కోసం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో టీడీపీ 135 చోట్ల గెలుపొందగా.. మంత్రివర్గంలో ఆ పార్టీకి 19 వరకూ మినిస్ట్రీ పోస్టులు దక్కనున్నాయి. అయితే ఎన్నికల్లో పోటీ చేసిన సీనియర్ నేతలు అందరూ విజయం సాధించిన నేపథ్యంలో అందరికీ మంత్రి పదవులు దక్కడం అనుమానమే.
ఈ నేపథ్యంలో సీనియర్ నేతల్లో ఒకరిని శాససనభ స్పీకర్గా ఎన్నుకోవాలని అధిష్టానం భావిస్తోందట. స్పీకర్ పదవి కోసం ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావ్, మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, బుచ్చయ్య చౌదరి పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ ముగ్గురు కూడా సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతలు కావటం విశేషం. కిమిడి కళా వెంకట్రావ్ ఇప్పటి వరకూ ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీద 11 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
ఇక చింతకాయల అయ్యన్నపాత్రుడు విషయానికి వస్తే ఇప్పటి వరకూ నర్సీపట్నం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ వెంటే కొనసాగుతున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి పెట్ల ఉమా శంకర్ గణేష్ మీద 24 వేలకు పైగా మెజారిటీతో గెలిచారు. ఇక గోరంట్ల బుచ్చయ చౌదరి కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. ఎమ్మెల్యేగా ఏడుసార్లు గెలుపొందారు. మొన్న జరిగిన ఎన్నికల్లోనూ రాజమండ్రి రూరల్ నుంచి 60 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. ఈ ముగ్గురు సీనియర్ నేతల పేర్లనూ స్పీకర్ పదవి కోసం పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మరోవైపు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు సైతం స్పీకర్ పదవిపై ఆశ పెట్టుకున్నారు. ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 50 వేలకు పైగా మెజారిటీతో గెలిచిన రఘురామ.. గతంలో ఓ సారి చంద్రబాబును స్పీకర్ పదవి అడిగారు. అలాగే పలు సందర్భాల్లో కుదిరితే తాను స్పీకర్గా పనిచేస్తానంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అయితే ఈ ముగ్గురి పేర్లు పరిశీలిస్తున్నారనే వార్తల నేపథ్యంలో రఘురామ కోరిక ఏ మాత్రం నెరవేరుతుందో మున్ముందు చూడాల్సిందే. అటు తెనాలి ఎమ్మెల్యే, జనసేన నేత నాదెండ్ల మనోహర్ కూడా స్పీకర్గా చేసిన అనుభవం ఉంది. మరి స్పీకర్ పదవి టీడీపీని వరిస్తుందా.. భాగస్వామ్య పార్టీలకు వెళ్తుందా మరికొన్ని రోజుల్లో తేలనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa