ఇటీవల వెలువడిన లోక్సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి సొంతంగా మెజార్టీ రాకపోవడంతో మిత్ర పక్షాల మద్దతుతో ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వంపై.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పొరపాటున ఏర్పడిందని.. అది ఎప్పుడైనా పడిపోవచ్చని అన్నారు. ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి మొత్తం 240 సీట్లు వచ్చాయని.. ఇది మ్యాజిక్ ఫిగర్ 272 కంటే తక్కువ అని ఖర్గే పేర్కొన్నారు. అయితే ఎన్నికలకు ముందు ఏర్పాటైన ఎన్డీయేకు పూర్తి మెజారిటీ వచ్చింది. ఇప్పుడు కేంద్రంలో కూడా ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడింది.
శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కేంద్రంలో అధికారాన్ని చేపట్టేంత మెజార్టీ నరేంద్ర మోదీకి రాలేదని.. ఇది మైనారిటీ ప్రభుత్వమని పేర్కొన్న ఖర్గే.. ఈ ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చని అన్నారు. కానీ.. తాము మాత్రం ఈ ప్రభుత్వం పడిపోవాలని కోరుకోవడం లేదని చెప్పారు. దేశ ప్రజలకు మంచి జరగడం కోసం తాము ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. దేశాన్ని పటిష్టం చేయడానికి కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఇక దేశానికి మంచి జరుగుతుందంటే మాత్రం దాన్ని జరగనివ్వకుండా చేయడం ప్రధాని నరేంద్ర మోదీకి అలవాటు అని విమర్శించారు. కానీ ఇండియా కూటమి మాత్రం పరస్పరం సహకరించుకుంటూ దేశాన్ని పటిష్ట పరుచుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం పావులు ఏమైనా కదుపుతోందా అనే అనుమానం వ్యక్తం అవుతోంది. ఎన్డీఏ ప్రభుత్వంపై మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై జేడీయూ నేత నీరజ్ కుమార్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర అందరికీ తెలిసిందేనని.. గతంలో పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ మైనార్టీ ప్రభుత్వాలను నడిపించారు అని గుర్తు చేశారు. చరిత్ర మరిచిపోతే ఎలా అని సెటైర్లు వేశారు. దేశ ప్రజలు నరేంద్ర మోదీ మద్దతుగా ఉన్నారని అన్నారు.