ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా టీడీపీ సీనియర్ లీడర్, నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎన్నికయ్యారు. స్పీకర్ ఎన్నిక కోసం ఇవాళ నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జరిగింది. అయితే టీడీపీ నుంచి చింతకాయల అయ్యన్నపాత్రుడు నామినేషన్ వేయగా.. గడువులోగా మరో నామినేషన్ దాఖలు కాలేదు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. మరోవైపు చింతకాయల అయ్యన్నపాత్రుడు తరుఫున డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్, నాదెండ్ల మనోహర్ శుక్రవారం ఉదయం అసెంబ్లీ కార్యదర్శికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ల దాఖలుకు సాయంత్రం వరకూ గడువు ఉండగా.. గడువులోగా అయ్యన్న నామినేషన్ ఒక్కటే దాఖలైంది. దీంతో ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమైంది. శనివారం చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏపీ అసెంబ్లీ స్పీకర్గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.
చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ వెంటే ఉన్నారు. 1983లో తొలిసారిగా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. ఇప్పటి వరకూ ఏడుసార్లు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నర్సీపట్నం నుంచి 24,676 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ మీద విజయం సాధించారు. తన రాజకీయ జీవితంలో మంత్రిగా, ఎంపీగానూ పనిచేసిన అయ్యన్నపాత్రుడు.. స్పీకర్ పదవిని అలంకరించనున్నారు.
మరోవైపు ఏపీ అసెంబ్లీ స్పీకర్ పదవి ఇప్పుడు మరోసారి ఉత్తరాంధ్ర వాసులనే వరించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో స్పీకర్గా తమ్మినేని సీతారాం వ్యవహరించారు. తమ్మినేని సీతారాం శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు స్పీకర్గా ఎన్నికైన చింతకాయల అయ్యన్నపాత్రుడు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ రకంగా మరోసారి అసెంబ్లీ స్పీకర్ పదవి ఉత్తరాంధ్ర వాసులను వరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa